mt_logo

జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న కేసీఆర్ కల సాకారమైంది: హరీష్ రావు

కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ విషయం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ సహా గత నెలలో మెడికల్ కాలేజీల అనుమతి పొందిన ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా అనుమతులతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైంది. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.. దేశంలోనే రికార్డ్ నెలకొల్పింది అని అన్నారు.

ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కోసం గత కేసీఆర్ ప్రభుత్వం నిధులు, భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 8 కాలేజీలకు గాను కేవలం నాలుగు మెడికల్ కాలేజీలకు మాత్రమే గత నెల ఎన్ఎంసీ నుండి అనుమతులు లభించాయి అని విమర్శించారు.

నిబంధనల ప్రకారం మౌలిక వసతుల ఏర్పాటు, బోధనా సిబ్బంది నియామకంలో ప్రభుత్వం విఫలమైందని ఎన్ఎంసి అనుమతులు నిరాకరించింది. జరిగిన తప్పును ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ఎంసీ నిబంధనల మేరకు అన్ని మౌలిక వసతులు, బోధన సిబ్బందిని సమకూర్చుకుంటామని అనుమతి కోరుతూ కేంద్రానికి అప్పీల్ చేసింది అని తెలిపారు.

దీన్ని పరిశీలించిన కేంద్రం అప్పీల్ అంగీకరించి, 4 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని ఎన్ఎంసీకి మార్గనిర్దేశం చేసింది. దీంతో ఒక్కో కాలేజీలో‌ 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం నాలుగు కాలేజీల్లో 200 సీట్లు ఈ అకడమిక్ ఇయర్‌కు అందుబాటులోకి రానున్నాయి అని హరీష్ రావు అన్నారు.

కొత్త సీట్లతో కలుపుకొని తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మొత్తం సీట్ల సంఖ్య 4,090 కు చేరుకుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090 సీట్లకు చేరింది. అంటే తొమ్మిదేళ్ళ కాలంలో 5 రెట్లు పెంచింది అని వివరించారు.

ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ఏటా పదివేల మంది పైగా డాక్టర్లను తయారుచేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ఎంబీబీఎస్ సీట్లలో లక్ష జనాభాకు 22 సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని అన్నారు. సమైక్య రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అని గుర్తు చేశారు.

తద్వారా పేద ప్రజల చెంతకే సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు, తెలంగాణ బిడ్డలు వైద్య విద్య చదివే అవకాశాలను గణనీయంగా పెంచారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే, తెలంగాణకు ఇక్కటి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని దుయ్యబట్టారు.

అయినప్పటికీ రాష్ట్ర సొంత నిధులతోనే కొత్తగా మొత్తం 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా వేగవంతమైన చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 70 ఏండ్లలో రెండు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు జరిగితే, స్వరాష్ట్రంలో 9 ఏండ్లలో 29 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది.. ఇది కేసీఆర్ ఘనత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత అని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్రం వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మకమైన పురోగతి. అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించింది. తెలంగాణ పిల్లలు వైద్య విద్య కోసమని లక్షలు ఖర్చు చేసి, చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్ వంటి దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. విద్యార్థులు మాతృ భూమికి, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ అవస్థలు పడాల్సిన అవసరం లేదు అని అన్నారు.

ఒకవైపు ఎంబీబీఎస్‌ చదవాలనే ఆశ, మరోవైపు అర్థం కాని భాష, దేశం కాని దేశంలో గోస. ఇదంతా ఒకనాడు. కొత్తగా వచ్చిన మెడికల్‌ కాలేజీలు, లోకల్‌ రిజర్వేషన్‌ వల్ల డాక్టర్‌ చదువాలనుకునే తెలంగాణ విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్లకు నిలయంగా మారిన తెలంగాణ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైట్ కోట్ రెవల్యూషన్‌కు నాంది పలికింది అని తెలిపారు.

ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన వారు రాష్ట్ర ప్రజలకే కాదు, వివిధ దేశాల్లో వారు సేవలందించబోతున్నారు. తద్వారా తెలంగాణ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయబోతున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా, వైద్య విద్య హబ్‌గా ఎదిగిందని చెప్పేందుకు గర్వపడుతున్నాను అని హరీష్ రావు అన్నారు.

పెరిగిన మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ కావాలనే కలను సహకారం చేసుకోవాలని కోరారు.

అదే విధంగా.. మెడికల్ కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని, మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూస్తూ ప్రతి ఏటా ఎన్ఎంసీ అనుమతులు (రెన్యువల్) కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా వైద్య విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.