mt_logo

పెండింగ్‌ పాల బిల్లుల గురించి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన హరీష్ రావు

పెండింగ్‌లో ఉన్న రూ. 80 కోట్ల పాల బిల్లుల చెల్లింపుల గురించి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. పెండింగులో ఉన్న బిల్లులను మొత్తం ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పూర్తి లేఖ యధాతథంగా 👇

రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పాడి రైతులు పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వం నడిపే విజయ డెయిరీకి ప్రతీ రోజు పాలు సరఫరా చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు చెల్లించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదు. 45 రోజుల పాల బిల్లులు పెండింగులో ఉన్నాయి. 45 రోజులకు గాను దాదాపు 80 కోట్ల రూపాయలు ప్రభుత్వం పాడి రైతులకు చెల్లించాల్సి ఉంది.

బ్యాంకులలో, మహిళా సంఘాలలో, వడ్డీ వ్యాపారుల దగ్గర ఇలా వివిధ మార్గాల ద్వారా అప్పు చేసి పాడి రైతులు పశువులు కొనుగోలు చేశారు. అప్పుల కిస్తీలు క్రమం తప్పకుండా కట్టుకోవాల్సి ఉంది. పశువులకు దాణా, మీండ్రాల్ మిక్షర్, కాల్షియం, మందులు ఇతరత్రా సామగ్రి కూడా రోజూ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

పాడి పశువులను పోషిస్తున్న వారంతా పేదలు, మధ్యతరగతి ప్రజలే. ఏరోజు కష్టంతో ఆరోజు వెళ్లదీసుకునే వారే. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన మాదిరిగానే ప్రతీ 15 రోజులకోసారి బిల్లులు చెల్లించాలని, పెండింగులో ఉన్న రూ. 80 కోట్ల బిల్లులను మొత్తం ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.