mt_logo

పదేళ్లలో బీజేపీ ఒక్క మంచి పని చేసిందా?: హరీష్ రావు

సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మనం పదేళ్లు పాలించినం.. వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది అని పేర్కొన్నారు.

సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్‌కు తరలించుకు పోయిండు రేవంత్ రెడ్డి. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని గంభీర ఉపన్యాసాలు ఇచ్చారు.. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అని అన్నారు.

రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు.. పని లేదు. ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయితది. బీజేపీ పేదలకు, తెలంగాణకు వ్యతిరేక పార్టీ.. సీలేరును లాక్కుని మనకు అన్యాయం చేసిన పార్టీ. పదేళ్లలో బీజేపీ చేసిన ఒక్క మంచి పని ఉందా? అని ప్రశ్నించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి బురద చల్లిండు.. ఇప్పుడు బడే మియా అంటుండు. కాంగ్రెస్, బిజేపీ ఒక్కటై తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా చేయాలనే కుట్ర పన్నుతున్నరు. ఇంటికి రెండెడ్లు, నిరుద్యోగ భృతి ఇస్తానని, రైలు తెస్తానని అబద్ధాలు చెప్పి ఉప ఎన్నికల్లో గెలిచిండు.. మొన్నటి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు అని హరీష్ దుయ్యబట్టారు.

ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు పని చేయాలి..బీజేపీని ఓడించే శక్తి బీఆర్ఎస్‌కే ఉందని ముస్లిం సోదరులు గుర్తించాలి. ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి అని పిలుపునిచ్చారు.

గులాబీ జెండాకు ప్రాణం పోసింది సిద్దిపేట. సిద్దిపేటకు అన్యాయం జరిగితే.. అక్కసు వెళ్ళగక్కితే ఉరుకుందామా.. సిద్దిపేట ప్రజలుగా చీము నెత్తురు ఉన్నోళ్ళం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మోసపోదామా అని అడిగారు.

సిద్దిపేటలో వివిధ అభివృద్ధి పనులు, రోడ్లకు రూ. 150 కోట్లు రద్దు చేసిండు. సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్,బీజేపీ పార్టీలు రెండు అక్కసు వెళ్ళబుచ్చారు.. అలాంటి వారికి సిద్దిపేటలో ఓట్లు ఎట్లా వేస్తాం. సిద్దిపేట అంటే ప్రత్యేకత.. గౌరవం ఉంది.. ఆ ప్రత్యేకతను మరోసారి చాటుకుందాం అని తెలిపారు.