mt_logo

మమ్మల్ని తిట్టండి.. కానీ రైతులను ఆదుకోండి: రైతు దీక్షలో కాంగ్రెస్‌ని కోరిన హరీష్ రావు

సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నాం.. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలను ఒక్క మంత్రి పరామర్శించడం లేదు అని విమర్శించారు.

ఎండిన పంటపొలాలను చూడడానికి రావడం లేదు. కరెంటు లేదు, నీళ్లు లేవు.. కన్నీళ్లే మిగిలాయి.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం చెల్లించాలి.. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు, చిల్లర మాటలు మాని, రైతులను కాపాడాలి.. మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోండి. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి.. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు రూ. 15 వేలు, వడ్లకు, మక్కలకు రూ. 500 బోనస్, రైతు కూలీలకు రూ. 12 వేలు, కౌలు రైతుల రూ. 15 వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు ఆని అన్నారు.

మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పింది.. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే.. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలి.. వడ్ల కొనబోమని చెప్పింది బీజేపీ కాదా? అని హరీష్ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చాక కళ్లు నెత్తుకెక్కాయి.. రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టమన్నడు కోమటిరెడ్డి..మీతో చెప్పుతో కొట్టించుకోవడానికి మిమ్మల్ని గెలిపించింది? కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప ఎండడు లేదు..కాంగ్రెస్ వచ్చింది, కరువొచ్చింది అని పేర్కొన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు.. మాట తప్పిన మీకు మళ్లీ మేనిఫెస్టో పెట్టే నైతిక అర్హత లేదు.. రైతులకు మేలు చేసే దాకా బీఆర్ఎస్ పోరాడుతుంది అని స్పష్టం చేశారు.

రైతులు ధైర్యంగా ఉండాలి.. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు.. మీకు అండగా మేముంటాం అని భరోసానిచ్చారు.