mt_logo

కేసీఆర్ రైతుల కోసం కొట్లాడుతుంటే.. రేవంత్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నడు: కేటీఆర్

సిరిసిల్లలో జరిగిన రైతు దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతు బంధు కోసం మేము రూ. 7,500 కోట్లు పెట్టినం.. కానీ కాంగ్రెసోడు వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చి రైతు బంధు బంద్ పెట్టిండు అని అన్నారు.

తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది.. ఇంత త్వరగా రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం గురించి మాట్లాడుకోవాల్సి రావటం బాధాకరం. కాంగ్రెస్ హామీలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు అని పేర్కొన్నారు.

ఎర్రటి ఎండల్లోనూ కేసీఆర్ గారు రైతుల కోసం బయటకు వచ్చి నేనున్నా అని వారికి భరోసా ఇస్తున్నారు. కెేసీఆర్ గారి బాటలో నడుస్తూ రైతుకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైతం రైతు దీక్షా కార్యక్రమం చేస్తున్నాయి అని తెలిపారు.

ఎన్నికల కోడ్‌తో రేవంత్ రెడ్డి పాలనా, అధికారం నా చేతిలో లేదు అంటున్నాడు. ఆయనకు ఉన్న అవగాహన అది.. అందుకే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే రైతు హామీలపైన మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాం.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పండి అని డిమాండ్ చేశారు.

రూ. 500 రూపాయల అదనపు బోనస్ ఇస్తారో, లేదో చెప్పండి. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఎన్నికల కమిషన్‌కి ఉత్తరం రాయండి.. రూ. 500 రూపాయల బోనస్‌తో పాటు, రైతుల పంట నష్టానికి ఎకరానికి రూ. 25 వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాయండి.. మా పార్టీ తరుపున కూడా మద్దతు ఇస్తాం అని స్పష్టం చేశారు.

ఈసీ అందుకు ఒప్పుకోకుంటే వెంటనే ప్రతి రైతు అమ్మిన బియ్యం గింజను లెక్కలోకి తీసుకొని ఎలక్షన్లు ముగిసిన వెంటనే వారికి 500 రూపాయల బోనస్ ప్రభుత్వం చెల్లించాలి.. రైతులకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు ఎన్నికల కమిషన్ సాకు చెబుతున్నారు అని కేటీఆర్ విమర్శించారు.

మంత్రి శ్రీధర్ బాబు వర్షాలు పడలేదని అబద్ధాలు చెబుతున్నారు.. కానీ వాతావరణ శాఖ నివేదిక మాత్రం సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగా నమోదైందని తెలిపింది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తంగా ఉన్న 300 పిల్లర్లలో రెండు, మూడు పిల్లర్లలో సమస్య వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది అని అన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే లక్షల ఎకరాల పంట పొలాలను కాంగ్రెస్ ఎండబెట్టింది.. కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ.. పంటలు ఎండబెట్టి రైతుల పొట్ట కొడుతోంది అని తెలిపారు.

కొట్టుకుపోయిందన్న కాళేశ్వరంలో నంది పంపు హౌస్ ఎట్ల ప్రారంభమైంది.. ఇప్పుడు నీళ్లను ఎట్ల పారిస్తున్నారు? డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పటికీ ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదు.. ఎన్నికల్లో ఓడిపోయామని రైతుల తరఫున కొట్లాడకుండా ఆగుతామా.. వారికి అండగా నిలబడేందుకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త సిద్ధంగా ఉండాలె అని పిలుపునిచ్చారు.

రైతుల తరుపున మనం కొట్లాడకుంటే కాంగ్రెస్ పార్టీ హామీలను పక్కనపెడుతుంది.. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇచ్చిన అన్ని హామీలను ఎగ్గొడతారు.. హామీలు అమలు చేయకున్నా ప్రజలు ఓటు వేశారని చెప్తారు.. రేవంత్ రెడ్డి తన వంద రోజుల పాలనకు రెఫరెండం అంటున్నాడు.. మరి కాంగ్రెస్ పార్టీ హామీల ద్వారా ప్రయోజనాలు పొందిన వాళ్లు కాంగ్రెస్‌‌కు ఓటు వేయండి అని అన్నారు.

రైతు భరోసా, రూ. 4,000 పెన్షన్, రూ. 2 లక్షల రుణమాఫీ వచ్చిన వాళ్లు కాంగ్రెస్ ఓటు వెయ్యండి.. రాని వాళ్లు మాకు ఓటు వేయండి.. హామీలను నెరవేర్చకుంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారన్న భయం కాంగ్రెస్ పార్టీలో మొదలైంది.. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి కొరత ఉన్నది.. మిషన్ భగీరథ నిర్వహణ కూడా చేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.

రేపటి నుంచి ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద గులాబీ కండువా కప్పుకొని వెళ్లి.. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. మీ రూ. 500 రూపాయల బోనస్ ఏమైంది అని ప్రశ్నిద్దాం. రైతుల తరుపున ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దాం.. 420 కాంగ్రెస్ హామీలను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అని కేటీఆర్ అన్నారు.

70 ఏళ్ల వయసులో కేసీఆర్ రైతుల కోసం కొట్లాడుతుంటే.. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి మాత్రం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. ముఖ్యమంత్రి అనేటోడు లంకె బిందెల కోసం వెతుకుతారా? ముఖ్యమంత్రి చేయాల్సింది రాష్ట్రానికి ఆదాయం పెంచటం.. పెట్టుబడులు తేవటం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం. మంది పిల్లలను మా పిల్లలు అని రేవంత్ రెడ్డి చెప్పుకోవటం సిగ్గు చేటు అని ధ్వజమెత్తారు.

30 వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. మీ ప్రభుత్వం వచ్చినంక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందో చెప్పాలి. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను తన ఖతాలో వేసుకుంటే నడవది రేవంత్ రెడ్డి. 30 వేల ఉద్యోగాలు పక్కన పెట్టి.. ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఇయ్యాల్సిందే అని డిమాండ్ చేశారు.

ఈరోజు ఒకవైపు రైతన్న ఇంకోవైపు నేతన్న ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. నేతన్నల కోసం బీఆర్ఎస్ పార్టీ దీక్షలు చేస్తోంది. వారికోసం ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొస్తాం.. నేతన్నలను ఆదుకునే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని తెలిపారు.

బీజేపీ నేత ఈటల రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతుండు.. బీజేపీ రుణమాఫీ గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఇదే మోడీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది నిజం కాదా.. ఇదే బీజేపీ నాయకులు రైతులను జీపులతో తొక్కి చంపింది అని గుర్తు చేశారు.

రైతులకు రుణమాఫీ అనుచితం అన్నది ఇదే నాయకులు కదా.. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీల కోసం పద్నాలుగున్నర లక్షల కోట్లు మాఫీ చేసిన నాయకులు రైతుల గురించి మాట్లాడడం దారుణం అని అన్నారు.