పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, ఇతర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ సిఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.
హరీష్ రావు రాసిన లేఖ యధాతధంగా
శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి,
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం,
విషయం: పంచాయతీరాజ్ శాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారం, నిధుల విడుదల గురించి.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి చెత్తా చెదారం, మురుగు కాల్వలను శుభ్రపరచడం, పరిసరాల పరిశుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, డంపింగ్యార్డుల్లో పిచ్చి మొక్కలు తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు నిర్వహించి, పల్లెలు, పట్టణాలను అద్దంలాగా మెరిసేలాగా చేశారు.
కానీ, ఏడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం కుంటుపడింది. గ్రామ పంచాయతీలకు నయా పైస కూడా విడుదల చేయకుండా నిర్వహణను గాలికి వదిలి వేయడంతో కునారిల్లుతున్నయి. మురికి కూపాలుగా మారుతున్నాయి. చివరకు ట్రాక్టర్లకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి. కొన్ని చోట్ల అధికారులు అప్పులు చేసి డీజిల్ పోయిస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పంచాయతీల్లో పారిశుద్ద్య నిర్వహణ సహా అనేక ముఖ్యమైన విధుల్లో నిత్యం శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు జీతాలు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. వేతనాలు అందకపోవడంతో దిక్కులేని స్థితిలో పనులు మానేశారు. దీంతో గ్రామాల్లో చెత్త సేకరణ ఆగిపోయింది. ట్రాక్టర్ మూలన పడింది. స్ట్రీట్ లైట్ల నిర్వహణ లేదు. తాగునీటి సరఫరా నిర్వహణ మూలనపడింది. ఫాగింగ్ లేదు, చివరకు బ్లీచింగ్ పౌడర్ అందించని దుస్థితి. దీంతో గ్రామాల్లో విషజ్వరాలు ప్రభలుతున్నాయి. మలేరియా, డెంగీ వంటి వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నరు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా వానాకాలం ప్రారంభంలోనే ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించేది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్లు పక్కన పెడితే ఉన్న పనులు కూడా చేయడం లేదు. అవసరమైన నిధులు విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు నెల నెలా రూ. 275 కోట్ల జీపీ నిధులు విడుదల చేశాం. మొత్తంగా ఏటా రూ. 3,330 కోట్లు ఇచ్చాం. పట్టణాల పారిశుద్య నిర్వహణ కోసం ప్రతి ఏడాది అదనంగా రూ. 1,700 కోట్లు ఖర్చు చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలల్లో 7 పైసలు కూడా విదిల్చింది లేదు.
ఒక్క పారిశుధ్య కార్మికులకే కాదు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సైతం గౌరవ వేతనాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నది. చేసిన పనులకు సర్పంచులు గవర్నర్ను కలిసి బిల్లులు విడుదల చేయాలని మొర పెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో వచ్చింది.
పంచాయతీలు, మున్సిపాలిటీల నిర్వహణ కోసం బీఆర్ఎస్ చేసిన కృషిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోగా, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. ఇప్పటికైనా పాడైపోతున్న గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడినపెట్టేందుకు కృషి చేయాలని, అందుకు గాను ఈ ముఖ్యమైన సమస్యలకు తక్షణం పరిష్కారం చూపాలని మిమ్ములను కోరుతున్నాను.
- గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
- పారిశుధ్య కార్మికులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి
- చేసిన పనులకు గాను సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
- వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి, పారిశుధ్యం పెంపొందించాలి
- టి హరీష్ రావు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే