mt_logo

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అద్భుతం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ మంగళవారం ( జూలై 4) హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసారు. తాను ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమాన్ని రాష్ట్రపతికి సంతోష్ కుమార్ వివరించారు. మొక్కల ప్రాధాన్యాన్ని తెలిపేలా రూపొందించిన “వృక్షవేదం” పుస్తకాన్ని రాష్ట్రపతికి అందించారు. అనంతరం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రారంభించిన ఈ ఐదేళ్లలో నాటిన మొక్కలను, సాధించిన ప్రగతిని, మొక్కలు నాటడం పట్ల ప్రజల్లో కలిగించిన అవగాహన కార్యక్రమాల వివరాలను రాష్ట్రపతికి పూసగుచ్చినట్టు వివరించారు.

సంతోష్ కుమార్ చెప్పిన విషయాలను ఆసక్తిగా తెలుసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో  భాగంగా మొక్కలు నాటుతున్న విషయం తనకు కూడా తెలుసని చెప్పారు.  అంతేకాదు, తనకు మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టమని. ఇప్పటికే అనేక సందర్భాల్లో మొక్కలు నాటినట్లు రాష్ట్రపతి తెలిపారు. వచ్చే హైదరాబాద్ పర్యటనలో ఈసారి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటుతానని తెలిపారు. ఇంత నిస్వార్ధమైన కార్యక్రమాన్ని అంకితభావంతో ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ ను రాష్ట్రపతి అభినందించారు. ప్రజోపయోగమైన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను మరింత ఉధృతంగా ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు.

అనంతరం మాట్లాడిన సంతోష్ కుమార్ .. రాష్ట్రపతి చొరవ, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పట్ల వారు చూపించిన అభిమానం అద్భుతమైన అనుభవమని. వారి ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ వెంట రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.