బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నిధులు కేటాయించాలని కోరుతూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ మాజీ చైర్మన్ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. బ్రాహ్మణ కులంలోనూ అనేకమంది పేదవాళ్లు వున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశారు.. బ్రాహ్మణుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని అన్నారు.
అర్చకులను ప్రతి నెల ధూపదీప నైవేద్యం ద్వారా కేసీఆర్ ఆదుకున్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు రేవంత్ రెడ్డి నిధులు కేటాయించాలి.. బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ స్కాలర్షిప్ను విడుదల చేయాలి. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నిధులు విడుదల చేయడంపై క్యాబినెట్లో చర్చించాలి అని కోరారు.
అసెంబ్లీ సమావేశాల వరకు అయినా నిధులు కేటాయించాలి.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో పని చేసే కింది స్థాయి ఉద్యోగులకు గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నిధులు కేటాయించకపోతే.. బ్రాహ్మణ సంఘాలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తాం.. బ్రాహ్మణ పరిషత్కు కొత్త పాలకవర్గం ఏర్పాటు చేయాలి అని రమణాచారి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ.. బ్రాహ్మణుల్లో చాలా మంది నిరుపేదలు వున్నారు.. బ్రాహ్మణుల గురించి ఆలోచించింది కేసీఆర్ మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీ.వీ. నరసింహారావు బ్రాహ్మణులను ఆదుకున్నారు అని అన్నారు.
ప్రభుత్వాలు మారితే పధకాలు మంచిగా అమలు కావాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే పథకాలు ఆగిపోతున్నాయి అని తెలిపారు.
బ్రాహ్మణుల దగ్గర మేధాసంపత్తి తప్ప ఆస్తులు లేవు.. చాలా మంది బ్రాహ్మణులు ఇతర దేశాల్లో స్థిరపడ్డారు.. మన దేశంలో బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా వుంది.. ప్రభుత్వం నుండి బ్రాహ్మణులకు మద్దతు ఉండాలి. విదేశాల్లో ఉన్న బ్రాహ్మణ విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలి అని కోరారు.
బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ మాట్లాడుతూ.. రమణాచారి బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ అయ్యాక అనేక మంది పేద బ్రాహ్మణులకు న్యాయం జరిగింది. అనేక మంది పేద బ్రాహ్మణ విద్యార్థులు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా విదేశాలకు వెళ్లారు అని గుర్తు చేశారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నిధులు రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పింది. బ్రాహ్మణ పరిషత్లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. విదేశాల్లో చదువుతున్న బ్రాహ్మణ విద్యార్థులు స్కాలర్షిప్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు.
పేద బ్రాహ్మణుల పట్ల ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలి. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి అని అన్నారు.