mt_logo

ఉద్యోగాల విషయంలో సమ్మక్క సారక్క సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధమాడారు: దాసోజు శ్రవణ్

కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో అమలు చేస్తామన్న మరో రెండు గ్యారంటీలపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

శ్రవణ్ మాట్లాడుతూ.. 27వ తేదీ నాడు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధి రెండు గ్యారంటీలు ప్రారంభిస్తారని చెబుతున్నారు. ప్రజలు తమతో మోసగించబడాలనుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు.. రేవంత్ రెడ్డి తీరు ఇపుడు అలానే ఉంది.. ఇది దుర్మార్గం అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చింది.. అందులో 13 హామీలున్నాయి.. రూ 500 కు సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి ఉచిత విద్యుత్ అన్నారు. రాష్ట్రంలో కోటి 24 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం 40 లక్షల మందికే ఉచిత 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్నారు. ప్రజా పాలన కింద ఎంత మంది 500 కే సిలిండర్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం లేదు.. తెల్ల రేషన్ కార్డుల కోసం కొత్తగా ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం లేదు.. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటె 40 లక్షల మందికే ఈ పథకం వర్తిస్తుంది అంటున్నారు.. అందరికీ ఇస్తామని ఇపుడే కొందరికే ఇస్తామంటున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సంవత్సరానికి 3 నుంచి 5 సిలిండర్లు ఇస్తామంటున్నారు.. ఇది దగా, మోసం కాదా? మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలి.. కొండను తవ్వి ఎలుక పట్టినట్టు ఉంది. గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారందరికీ పథకం వర్తింపచేయాలి. ముందు డబ్బులు వినియోగదారుడు కట్టాలి తర్వాత సబ్సిడీ ఇస్తామనేది సరికాదు అని తెలిపారు.

రాష్ట్రంలో కోటి 34 లక్షల 48 వేల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కోటి ఐదు లక్షల మంది 200 యూనిట్ల లోపే విద్యుత్ వాడుతున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వాడే అందరికీ ఉచితంగా ఇవ్వాలి. డొంక తిరుగుడు నిబంధనలు పెట్టడం సరికాదు అని అన్నారు.

సమ్మక్క సారక్క సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధమాడారు.. 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ పచ్చి అబద్ధం చెప్పారు. సమ్మక్క సారక్క సాక్షిగా సీఎం రేవంత్ నయవంచనకు పాల్పడ్డారు అని శ్రవణ్ దుయ్యబట్టారు.

అయిపోయిన పెళ్ళికి బాజా కొట్టినట్టు ఉంది సీఎం రేవంత్ తీరు.. కేసీఆర్ హాయం లో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు రేవంత్ తనవిగా ఎలా చెప్పుకుంటారు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేసీఆర్ హయంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కలిపితే ఎలా? అమ్మవారి సాక్షిగా అబద్దాలాడినందుకు సీఎం క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

కరెంటు కోతలకు కొందరు అధికారులే కుట్ర పన్నారని సీఎం రేవంత్ అంటున్నారు. కరెంటు కట్ చేస్తే కొలువులు తీసేస్తా అని కూడా చెప్పారు. కేసీఆర్ హయంలో కను రెప్ప కొట్టుకునే సమయం కూడా కరెంటు పోలేదు.. రేవంత్ రాగానే కరెంటు ఇబ్బందులు ఎందుకు మొదలయ్యాయి అని ప్రశ్నించారు.

రేవంత్ తన చేతకానితనాన్ని అసమర్ధతను చిన్న ఉద్యోగులపై ఫత్వాలు జారీ చేస్తున్నారు. రేవంత్‌కు పాలన చేతకావడం లేదని ప్రజలు గ్రహించాలి. భట్టి సంబంధిత శాఖ మంత్రి.. కరెంటు పోయినందుకు ఆయన్ను కూడా రేవంత్ సస్పెండ్ చేస్తారా అని అడిగారు.

రైతు బంధుపై ఇప్పటి దాకా మీన మేషాలు లెక్కపెడుతున్నారు.. రైతు నోట్లో రేవంత్ మట్టి కొడుతున్నారు.. ఇప్పటిదాకా 30 మంది ఆటోడ్రైవర్లు చనిపోయారు. వారి సంక్షేమం కోసం మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని ఎందుకు అమలు చేయడం లేదు. రైతుల పండించిన పంటకు బోనస్ ఇస్తామన్నారు.. అది కూడా లేదు.హడావుడిగా హామీలు ఇచ్చినంత శ్రద్ద వాటి అమలుపై లేదు. మేము రేవంత్ ఇచ్చిన హామీలపైన నిలదీస్తూనే ఉంటాం అని స్పష్టం చేశారు.