mt_logo

అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గుంజుకునే ప్రయత్నం చేస్తుంది: హరీష్ రావు

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడి అరెస్ట్‌ని ఖండిస్తూ.. మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేదించడమే కాంగ్రెస్ పని అయిపోయింది.. పార్టీలో చేరుకుంటే అక్రమ కేసులు పెడుతున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసింది అని పేర్కొన్నారు.

అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. వందల మంది వెళ్లి మూడు గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది.. ఆయన ఏమైనా బందిపోటా.. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేసారు అని ప్రశ్నించారు.

అధికారం ఎవరికి శాశ్వతం కాదు అన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి.. బెయిల్ వచ్చే సెక్షన్లతో కేసులు ఉన్న ఏదో ఒక రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారు.. బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనుకుంటున్నారు అని హరీష్ రావు అన్నారు.

ప్రజలకి సేవ చేయడానికి మీకు అవకాశం ఇచ్చారు.. మంత్రి ఆదేశాలతో మేము దాడులు చేస్తున్నామని స్వయంగా ఆర్డీవో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్లు ఉన్నాయి.. వాటికి పర్మిషన్ లేకున్నా లీజ్ అయిపోయినా నడుస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారు అని తెలిపారు.

ఇప్పటికి మూడు కేసులు పెట్టారు.. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు.. గ్రామాల్లో తాగు నీరు రావట్లేదు.. పంటలు ఎండిపోతున్నాయి ఇవి పట్టించుకోరు. ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేస్తాం అని స్పష్టం చేశారు.

మా పార్టీ నాయకుల మెడపై కత్తిపెట్టి కాంగ్రెస్‌లోకి రావాలని బెదిరిస్తున్నారు. పార్టీ మారకపోతే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు గురిచేస్తున్నారు అని అన్నారు.