mt_logo

మరికాసేపట్లో క్యాబినెట్ భేటీ – మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం

హైదరాబాద్:  రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇదే మొదటి క్యాబినెట్ సమావేశం కానుంది. ఇందుకోసం సాధారణ పరిపాలన శాఖ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఎజెండాలో 20కి పైగా అంశాలు ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో ఈసారి ఎక్కువ అంశాలు టేబుల్ ఎజెండాగానే మంత్రివర్గం ముందుకు రానున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సమీకృత కొత్త సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం మొదటిసారి సమావేశం కాబోతోంది. మంజీరా కార్పొరేషన్ ఏర్పాటు ఆమోదం, ర్యాటిఫికేషన్ కోసం అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లాంటి ఇరిగేషన్ ఫైల్స్‌తో సహా మొత్తం 20కి పైగా అంశాలు ఎజెండాలో ఉండనున్నట్లు సమాచారం.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలపై సీఎం దిశానిర్ధేశం చేయనున్నారు.


తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై క్యాబినెట్ సమావేశంలో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్మారక జ్యోతి ప్రారంభ తేదీ మంత్రివర్గ సమావేశంలో ఖరారయ్యే అవకాశం ఉంది. అలాగే పోడు పట్టాల అంశంపై ఒక స్టేటస్ రిపోర్ట్ కేబినెట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షా 50 వేల మంది ఆదివాసీలు, గిరిజనులకు సుమారు 4 లక్షల ఎకరాల పోడు భూమికి సంబంధించి పట్టాలు పంచే కార్యక్రమ తేదీపై కూడా ఇదే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా మంత్రివర్గం సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్లు అంచనా.