కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు అభివృద్ధి, సంక్షేమంలో దారుణంగా విఫలమైంది. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నదనే కలరింగ్ తప్ప.. దేశంలోని సామాన్యుల బతుకులు అత్యంత దుర్భరంగానే ఉన్నాయి. నిరుద్యోగం తాచుపాములా బుసలుకొడుతున్నది. ఇప్పటివరకూ ఏ సూచీ చూసినా భారత్ స్థానం అట్టడుగునే. అయితే, వీటన్నింటినీ కప్పిపుచ్చి మళ్లీ ఓట్లు దండుకొనేందుకు బీజేపీ సినిమా రంగాన్ని వాడుకొంటూ చిల్లర రాజకీయం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో అయోధ్య రామ మందిరం, కశ్మీర్కు స్వయంప్రతిపత్తి పేరిట ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కిన మోదీ సర్కారు ఈ సారి ప్రచార అస్త్రాలుగా సినిమాలను వాడుకొంటున్నది.
మొన్నటిదాకా కశ్మీర్ ఫైల్స్ సినిమాతో రెండు వర్గాల మధ్య వైషమ్యాన్ని పెంచి.. మెజార్టీ వర్గాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఆ సినిమా పేరుచెప్పి మైనార్టీలతో పండిట్లకు ముప్పు ఉందనే సీన్ క్రియేట్ చేసింది. అయితే, సినిమాలో ఎవరైతే బాధితులుగా చూపించారో.. ఆ పండిట్లే తమకు బీజేపీ సర్కారు చేసిందేమీ లేదని.. తమ భద్రతను గాలికొదిలేసిందని రోడ్డెక్కారు. కేవలం సినిమా పేరుతో పండిట్లకు ఏదో చేసినట్టు చూపి.. నిజజీవితంలో మాత్రం వారి కష్టాలకు పరిష్కారం చూపలేకపోయింది. ఇప్పుడు దేశంతోపాటు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలోనూ రెండు వర్గాలను రెచ్చగొట్టేందుకు రజాకార్ అనే సినిమాతో భారీ కుట్ర పన్నుతున్నదనే ప్రచారం జరుగుతున్నది.
ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకొనే కుట్ర
పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజలకు నిర్ధిష్టంగా ఇది చేశాం.. ఈ ప్రణాళికలు రూపొందించాం అని చెప్పుకొనేందుకు ఒక్క అంశమూ లేదు. అందుకే మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సమాజంలో చిచ్చుపెట్టేలా ప్లాన్ చేసింది. ఇందుకు సినిమా మాధ్యమాన్ని కాషాయ పార్టీ వాడుకొంటున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు పెంచి.. భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఇప్పుడు రజాకార్ అనే సినిమాను బీజేపీ పార్టీ అస్త్రంగా వాడుకొంటున్నది. సీఎం కేసీఆర్ పాలనలో సుభిక్షంగా.. సుఖశాంతులతో ఉన్న తెలంగాణలో విచ్ఛిన్నకర వాతావరణం సృష్టించాలని ప్లాన్ వేసింది. పదేండ్లుగా గంగాజమునా తెహజీబ్గా ఉన్న తెలంగాణలో మతచిచ్చు రేపేందుకు మంటపెడుతున్నది.
నిజాం రాజు పాలనలో జరిగిన సంఘటనలను యధార్థంగా చూపుతున్నామంటూ ఇటీవల రిలీజైన రజాకార్ టీజర్లో.. రజాకర్లు చేసిన దౌర్జన్యాలు, అరాచక చర్యలను చూపిస్తూ వచ్చారు. ఇందులో ప్రధానంగా హిందువులందరినీ ఇస్లాం మతంలోకి మార్పించి.. ముస్లిం రాజ్యంగా మార్చాలన్న లక్ష్యంతో రజాకర్లు క్రూరచర్యలకు పాల్పడ్డారంటూ చిత్రీకరించారు. ముఖ్యంగా బ్రాహ్మణుల యజ్ఞోపవీతాలను తెంపేయటం.. తెలుగు మాట్లాడేవారి నాలుకలను కోసేయటం.. ఇస్లాం మతంలోకి చేరని వాళ్లను మూకుమ్మడిగా ఉరి తీయటం లాంటి ఘోరాలను టీజర్లో చూపించారు. దీనిపై తెలంగాణలో మతపెద్దలు, రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతకరం వ్యక్తంచేస్తున్నారు. ఇందులో కేవలం ముస్లింలనే టార్గెట్ చేస్తూ చూపించారని, మెజార్టీ వర్గాన్ని రెచ్చగొట్టేందుకు బ్రాహ్ముణులపై అఘాయిత్యాలు జరిగినట్టు చూపించారని మండిపడుతున్నారు.
చరిత్రను తమకు అనుకూలంగా వక్రీకరించారని, ఎలక్షన్ల సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు ఈ సినిమా తీసినట్టు ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతఘర్షణలు తప్పవని అంటున్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ సెన్సార్ బోర్డు అధికారుల దృష్టికి దీన్ని తీసుకెళ్తామని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దెబ్బతినకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది తెలివితక్కువ బీజేపీ జోకర్లు.. వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం.. తెలంగాణలో మత విద్వేషాలు సృష్టించాలని చాలా కష్టపడతున్నారని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మండిపడ్డారు. ప్రజలు వాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు.