- కోకాపేటలో ‘భారత్ భవన్’
- సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్చార్డీ ఏర్పాటు
- 15 అంతస్థుల్లో భవనం
- కాసేపట్లో శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
- బీఆర్ఎస్ పార్టీకీ శిక్షణ, పరిశోధనా కేంద్రం
- అతి పెద్ద డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు

హైదరాబాద్, జూన్ 5: బీఆర్ఎస్ హైదరాబాద్లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది.మరి కొద్దీ సేపట్లో సీఎం కేసీఆర్ ఈ శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోని మరి ఏ ఇతర రాజకీయ పార్టీకి లేని విధంగా అన్ని హంగులతో అత్యాధునిక పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా ‘భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ కేంద్రాన్ని నెలకొల్పనున్నది. హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. మొత్తం 15 అంతస్థుల్లో భవనాన్ని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.దేశంలోని ఏ ప్రాంతం వారు వచ్చినా సమస్త సమాచారం లభించేలా, పార్టీ కార్యకర్తలకు సమగ్రమైన శిక్షణ లభించే కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. పెద్ద సమావేశ మందిరాలు, అత్యాధునికమైన డిజిటల్ లైబ్రరీ, వివిధ భాషా పత్రికలు, వాటిలో వచ్చే వార్తల సమాచారాన్ని క్రోడీకరించడం, పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం, రాష్ర్టాలవారీగా, రంగాలవారీగా వివరాలను సమీకరించడం, వాటిని క్రోడీకరించడం వంటివి ఇక్కడ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలను ఏర్పాటు చేయనున్నారు.