mt_logo

నయా దేశ్‌ముఖ్ రేవంత్ పాలనలో దళిత, బహుజన జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు: బీఆర్ఎస్ నేతలు

తెలంగాణలో జర్నలిస్టుల పైన జరుగతున్న దాడులపై స్పందిస్తూ మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, క్రాంతి కిరణ్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఆంజనేయ గౌడ్, పల్లె రవికుమార్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నిజంగానే నడుస్తోంది.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లు.. కూల్చివేతలు. ప్రశ్నించే గొంతుకలపై ప్రజాపాలన అని చెప్పుకుంటూ దాడులు చేస్తున్నారు అని పేర్కొన్నారు.

సీనియర్ జర్నలిస్టు శంకర్‌పై కాంగ్రెస్ గుండాలు పథకం ప్రకారం దాడి చేశారు.. చంపాలని పాశవికంగా దాడి చేశారు. ఇలాంటి పాశవిక దాడిని తెలంగాణ బుద్ది జీవులు సమాజంలోని అన్ని వర్గాలు ఖండించాలి. అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా.. సీఎం రేవంత్ సమాధానం చెప్పాలి అని అన్నారు.

చిలుక ప్రవీణ్, రంజిత్, ఆకుల ప్రవీణ్ అనే జర్నలిస్టుల మీద కూడా దాడులు వేధింపులు జరిగాయి. జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త సాయిరాం రెడ్డి అని సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని సాయిరాం రెడ్డి కలిశాకే ఈ దాడి జరిగింది. శంకర్ పై దాడికి ముందే సాయిరాం రెడ్డి రెక్కీ నిర్వహించాడు. సాయిరాం రెడ్డి హస్తినపురం కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి అనుచరుడు. కాంగ్రెస్ పాలన మూడు నెలలు కాకముందే అనేక ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి అని సుమన్ అన్నారు.

నిన్న మేడారంలో సీఎం రేవంత్ ముందే భక్తులపై లాఠీఛార్జ్ చేశారు. ఇప్పటి దాకా 2600 మంది బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు అయ్యాయి. ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా చెలరేగుతోంది. విసునూరు రామచంద్ర రెడ్డి, ఎర్ర పహాడ్ ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్‌ముఖ్‌లతో దళిత బహుజనులు ఎలాంటి దాష్టీకాలు ఎదుర్కుంటున్నారో ఇపుడు నయా దేశ్‌ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో అవే దౌర్జన్యాలు ఎదుర్కొంటున్నారు. నయా దేశ్‌ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో దళిత బహుజన జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి అని తెలిపారు.

పోలీసులు కూడా అతిగా వ్యవహరిస్తున్నారు.. మా వాళ్ళు ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టలో వేస్తున్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు . ఇది పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. మేము అన్ని గమనిస్తున్నాం. బీఆర్ఎస్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు ఎందుకు బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏ పోస్టులు పెట్టినా చెల్లుతుందా.. నయా దేశముఖ్ రేవంత్ 20, 30 ఏళ్లు అధికారంలో ఉంటారని పోలీసులు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

రేవంత్‌కు మీడియా పట్ల ఎలాంటి చులకన భావంతో ఉండే వారో ఆయన పాత వీడియోలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పాశవిక హింసాత్మక ధోరణిని రేవంత్ ఇప్పటికైనా మానుకోవాలి అని సుమన్ సూచించారు.

మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. రేవంత్ పాలన ప్రజా పాలన కాదు తెలంగాణ మీద ప్రతీకార పాలన.. తెలంగాణ త్యాగాలతో వచ్చింది.. ఆ త్యాగాలు రేవంత్‌కు తెలియవు.. తెలంగాణ కోసం పోరాడిన వారిపై రేవంత్ కక్ష కట్టారు. మా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తూ ఉల్టా తప్పుడు కేసులు పెడుతున్నారు అని తెలిపారు.

ఎమర్జెన్సీ చీకటి రోజులను కాంగ్రెస్ పాలన తలపింపజేస్తోంది.. జర్నలిస్టులు ప్రజా సమస్యలపైనే స్పందిస్తున్నారు.. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.

సిద్దిపేట జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్త చంపుతానని బెదిరిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. మేధావులు ఈ అరాచక విధానాలపై స్పందించాలి. కేసీఆర్ హయంలో ఇలాంటివి జరగలేదు అని అన్నారు.

కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన అంటే బూతులు, దాడులు, కేసులుగా మారింది. అభివృద్ధిపై ధ్యాస లేదు. కాంగ్రెస్ (ఐ) కాంగ్రెస్ (ఆర్)గా మారింది.. కాంగ్రెస్ (ఆర్) అంటే కాంగ్రెస్ రేవంత్ రౌడీలు.. బీఆర్ఎస్ పై ఆరాచకాలను వెంటనే ఆపాలి అని అన్నారు.