mt_logo

నేటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల- సీఎం నిర్ణయం

నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రికి పలు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో… గురువారం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సాగర్ ఎడమ కాలువ కింద వరి పంటలకు సాగునీరు అందించే విషయంపై చర్చించారు.

తెలంగాణ వాటా కింద కృష్ణా జలాలలో మన నీరు ఉన్న నేపథ్యంలో, రేపటి నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మరో 20 రోజుల తర్వాత మరో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. వానలు లేక, సాగర్ రిజర్వాయర్ లో ఆశించిన మేరకు నీటి నిల్వలు లేని కారణంగా, సాగునీటిని  ఒడుపుగా పొదుపుగా వాడుకొని వరి పంటను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ రైతాంగానికి పిలుపునిచ్చారు.

 సాగర్ ఎడమ కాలువ నీళ్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలలో పర్యవేక్షిస్తూ, రైతుల చివరి పొలాలకు, చివరి ఆయకట్టు దాకా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.