హుజూరాబాద్ పట్టణంలో మాజీ ఎంపీ వొడితల రాజేశ్వరరావు విగ్రహావిష్కరణ మహోత్సవానికి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేశ్వర రావు విగ్రహావిష్కరణ నా చేతుల మీదుగా జరగడం ఎంతో అదృష్టం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో తన వ్యాసాల్లో వివరించేవారని గుర్తు చేసారు.
నిజంగా వొడితెల డీఎన్ఏ లోనే తెలంగాణ జీన్స్ ఉంది అని చెప్పక తప్పదన్నారు. సర్పంచ్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన తన హుజురాబాద్, సింగాపురంను ఎప్పుడు మర్చిపోలేదు. లీడర్లు, ప్రజాప్రతినిధులు, నక్సలైట్లు అంటే భయపడతారు. కానీ నక్సలైట్లు కూడా రాజేశ్వర్ రావును ఇష్టపడేవారు. ఒక అద్భుతమైన కుటుంబం. ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఎంతో ప్రేమ ఆప్యాయత పంచేవారు. ఒక వైపు డయాలిసిస్ నడుస్తుంటే మరో చేత్తో తెలంగాణ ఉద్యమం గురించి వ్యాసాలు రాసేవారు.కేసీఆర్ రాజేశ్వర్ రావు మధ్య ఎనలేని అనుబంధం ఉండేది. సింగపూర్ రాజేశ్వర్ రావు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా, కరీంనగర్, వరంగల్ జిల్లాలకే కాకుండా రాష్ట్రానికి వివిధ హోదాల్లో సేవలందించారు.
కాంగ్రెస్ లో ఉంటూ తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన వ్యక్తి . తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊపిరిలూదిన వ్యక్తి రాజేశ్వర్ రావు. ఈ ప్రాంతంలోని 40 గ్రామాల్లో 33 ఏండ్ల కిందటే శుద్ధ తాగు జలాలు ప్రజలకు అందించేందుకు ఫిల్టర్ బెడ్ నిర్మించిన వ్యక్తి రాజేశ్వర్ రావు. ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు ఆ కాలంలోనే కేజీ టూ పీజీ విద్యాసంస్థలను స్థాపించిన దార్శనికుడు రాజేశ్వర్ రావు.
1990 లలోనే ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పి ఎంతో మంది సాంకేతిక నిపుణులను సమాజానికి అందించిన మహాను భావుడు రాజేశ్వర్ రావు అని గుర్తు చేసారు. రాజేశ్వర్ రావు తెలంగాణకు విద్యనందించడం లోనే కాదు ఉద్యమ వ్యాప్తి లోనూ తన వంతు సహాయ సహకారాలు అందించేవారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి రాజేశ్వర్ రావు హైదరాబాద్ నివాసంలో లెక్క లేనన్ని మీటింగ్ లు జరిగాయని చెప్పారు.
ఢిల్లీలో తనకున్న పరిచయాలతో రాజేశ్వర్ రావు తెలంగాణ భావ వ్యాప్తికి విస్తృతంగా వాడారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ వాదులను సంఘటితం చేసేందుకు చివరిదాకా శ్రమించారు.లక్ష్మి కాంత రావు టీఆర్ఎస్ లో రాజేశ్వర్ రావు కాంగ్రెస్ లో ఉన్నా తెలంగాణ కోసం వారిద్దరూ చేసిన మేలు ఎంతో విలువైనది. బీఆర్ఎస్ కు ఇక్కడ బలమైన పునాదులు ఏర్పరిచింది వొడితల కుటుంబమే అని చెప్పక తప్పదన్నారు మంత్రి హరీశ్ రావు.