mt_logo

కేంద్రం తెచ్చిన కొత్త న్యాయ చట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతంగా మారాయి: వినోద్ కుమార్

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త న్యాయ చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని ఆరోపిస్తూ.. తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. జూలై 1 వ తేదీ నుండి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకువస్తుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ చట్టాలు వున్నాయి. మార్పు అంటే మంచి జరగడం.. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త న్యాయ చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని విమర్శించారు.

2023 ఆగస్టులో చట్టాల మార్పు బిల్లులను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొత్త చట్టాలపై విస్తృతంగా పరిశీలించి అనేక మంచి సూచనలు చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనలను కేంద్రం పట్టించుకోలేదు. దాదాపు 160 మంది పార్లమెంట్ సభ్యులను బయటకు పంపి బిల్లును కేంద్రం పాస్ చేయించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ న్యాయవాదులు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు.

కొత్త చట్టాలను రద్దు చేయాలని కేంద్ర హోంశాఖా మంత్రి, న్యాయ శాఖా మంత్రులకు లేఖ రాశాను. చట్టాలను ఇంగ్లీష్‌లో ప్రవేశపెట్టాలని రాజ్యంగంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్‌కు భారతీయ న్యాయ సంహిత అని పేరు పెట్టారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు భారతీయ నాగరిక సురక్ష సంహిత అనే పేరు పెట్టారు.. కొత్త చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లు పెట్టారు. కొత్త చట్టాల పేర్లు దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకంగా ఉన్నాయి అని పేర్కొన్నారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్లు ఆందోళన చేయవద్దని అన్ని బార్ అసోసియేషన్స్‌కు లేఖలు రాశారు. మోడీ తెచ్చిన నల్ల చట్టాలతో  రైతులు చనిపోయారు. చట్టాల మార్పులను వాయిదా వేయాలని మోదీని డిమాండ్ చేస్తున్నాం అని వినోద్ కుమార్ తెలిపారు.

ఎఫ్ఐఆర్‌ను రిజిస్టర్ చేయకుండా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే విధంగా కొత్త చట్టం తెచ్చారు. స్టేషన్ బెయిల్‌ను స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ దుర్వినియోగం చేస్తున్నారు. బాధితుడు హింసకు గురి అవుతున్నారు.. దేశ న్యాయ వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తుంది. కొత్త చట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతంగా మారాయి అని దుయ్యబట్టారు.

చేతికి బేడీలు వేయవద్దని సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు కొత్త చట్టాల్లో చేతికి బేడీలు వేయాలని వుంది. కొత్త చట్టాల వలన బాధితుడికి అన్యాయం జరుగుతోంది. పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి 14 రోజులకు బదులుగా 90 రోజుల వరకు అవకాశం ఇచ్చారు అని అన్నారు.

బార్ కౌన్సిల్‌ను మోడీ మోసం చేశారు.. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేస్తున్నా. కొత్త చట్టాలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలి. కొత్త చట్టాలపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుంది అని స్పష్టం చేశారు.