mt_logo

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలి: ఎమ్మెల్సీ కవిత

  • తెలంగాణ డిక్లరేషన్‌ల పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా?
  • గాంధీ కుటుంబానికి కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న
  • ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే తెలంగాణకు రావాలి
  • రాహుల్ గాంధీ అవుట్ డేటెడ్ నాయకుడు
  • ప్రజలకు పీక్క తినడానికి కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు
  • కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
  • జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం

జగిత్యాల:  మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు దేశంలోని కీలక అంశాలపై మీ వైఖరి ఏమిటని గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు. దేశంలోని ముఖ్యమైన అంశాలపై ఏ వైఖరి లేని ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు. కీలకమైన అంశాలపై మౌనం వహించడం తగదని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. 

“కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం రెండు రోజుల్లో మొత్తం గాంధీ పరివారం తెలంగాణకు వస్తుంది. నేను వాళ్లకు ఒకే ప్రశ్న అడుగుతున్నాను. తెలంగాణ డిక్లరేషన్‌ల పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా ? తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలలోనైనా ఊహించగలరా ? ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణకు రావాలి” అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. మహిళా బిల్లుపై, రైతాంగ అంశాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటని నిలదీశారు.

వీళ్లు మారారా.? అప్ డేట్ కారా ? 

బుధవారం రోజు జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ అప్ డేట్స్ లేని అవుట్ డేటెడ్ నాయకుడని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి ఆలోచన లేదని, సీఎం కేసీఆర్ వేగాన్ని రాహుల్ గాంధీ అందుకోలేరని అన్నారు. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ ఆపలేకపోతున్నారు కాబట్టే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అయ్యిందని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పార్టీ తీరు గమ్మతిగా ఉంటుందని ఎద్దేవా చేశారు. “ఇటీవల రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చి పోడు పట్టాలు ఇస్తామంటున్నారు.  వీళ్లు మారారా.? అప్ డేట్ కారా ? మనం మొన్ననే అన్ని పోడు పట్టాలు ఇచ్చేశాము. మళ్లీ వాళ్లు వచ్చాకనట పోడు పట్టాలు ఇస్తారటా.” అని అన్నారు. దళితులకు మార్కెట్ కమిటీ పదవుల్లో రిజర్వేషన్లు ఇస్తామని దళిత డిక్లరేషన్ లో ఎక్కడైనా పెట్టారా? అని నిలదీశారు. 

 ప్రజలను పీక్క తినడానికి వచ్చేవాళ్ళు కాంగ్రెస్ నేతలు

మనం దళిత బంధు కింద రూ. 10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్లు రూ. 12 లక్షలు ఇస్తరట, కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని మండిపడ్డారు. మనం ఏం ఇస్తుంటే దానికి ఇంకో రెండు ఎక్కువ ఇస్తామని చెప్పడం తప్పా వేరే ముచ్చట లేదని విమర్శించారు. డిక్లరేషన్‌ల పేరిట తెలంగాణలో ఇచ్చిన హామీలను ఇతర రాష్ట్రాల్లో కూడా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు సమాధానం  చెప్పిన తర్వాత రాష్ట్రానికి రావాలని సూచించారు. కాంగ్రెస్ కు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయినందుకు దేశవ్యాప్తంగా ఆ పార్టీ తిరస్కరణకు గురయ్యిందని స్పష్టం చేశారు.  దేశంలో తిరస్కరించిన పార్టీని మనం నమ్ముదామా? అని ప్రశ్నించారు. గతంలో ప్రతీ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాలుగైదు రాష్ట్రాలకే పరిమితమయ్యిందని చెప్పారు. ప్రజలను పీక్క తినడానికి వచ్చేవాళ్ళు కాంగ్రెస్ నేతలని మండిపడ్డారు.

 “కేసీఆర్ అంటే… కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు”

నీళ్ళు, నిధులు, నియామకాల నినాదంతో కొట్లాడి తెలంగాణను తెచ్చుకొని ఇవాళ ప్రతీ పల్లెకు నీళ్లు, నిధులు, ప్రతీ ఒక్క యువకుడికి నియామకం కల్పించే పరిస్థితికి వచ్చామని తెలిపారు. దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్1 గా ఉందన్నారు. ఉద్యోగాల కల్పనలో, తలసరి ఆదాయంలో, మత సామరస్యంలో, పంటలు పండించడంలో, మహిళా అభ్యున్నతిలో, పెట్టుబడులను ఆకర్శించడంలో, రైతులు, దళితులు, మైనారిటీ, ఎస్టీ, బీసీ సంక్షేమంలో రాష్ట్రం నెంబర్1 గా ఉందని వివరించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వంటి నాయకుడు ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు.  “కేసీఆర్ అంటే… కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు”. కానీ కేసీఆర్ అంటే కైండ్ హార్టెడ్ కమిటెడ్ రెస్పాన్సిబుల్ లీడర్. ఇటువంటి నాయకులు చాలా తక్కువగా ఉంటారు. తెలంగాణకు అటువంటి నాయకుడు దొరకడం మన అదృష్టం.” అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎప్పుడూ కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు విజయవంతం కాలేదని, కానీ అది కేసీఆర్ తో నే సాధ్యమైందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించిందని అన్నారు.

కన్నతల్లికి అన్నం పెట్టారు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు 

వికలాంగులకు తెలంగాణలో నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తుంటే కర్ణాటకలో రూ. 400, గుజరాత్‌లో రూ. 1250, రాజస్థాన్ లో రూ. 750, ఛత్తీస్గడ్‌లో రూ. 500, ఉత్తర ప్రదేశ్‌లో రూ. 1000, మహారాష్ట్రలో రూ. 300, మధ్య ప్రదేశ్ లో రూ. 300, ఒరిస్సాలో రూ. 200 మాత్రమే ఇస్తున్నారని, తెలంగాణలో ఇస్తున్న దానికి  రాష్ట్రం కూడా దరిదాపుల్లో లేదని అన్నారు. తమకు అధికారం ఇస్తే పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచుతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, ఇది కన్నతల్లికి అన్నం పెట్టారు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తామన్నట్లుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మవద్దని కోరారు.

మాయమాటలు నమ్మవద్దని, మోసపోవద్దు

జీవన్ రెడ్డి వంటి స్థానిక నాయకులు సొంత కుటుంబానికి పదవులు ఇచ్చుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను గత ఎన్నికల్లో కంటే ఎక్కవ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ రావడంతో వెయ్యి  ఏనుగు బలం వచ్చిందని చెప్పారు. జీవన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నాయని, కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాయమాటలు నమ్మవద్దని, మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రతీ ఒక్క కుల సంఘానికి స్థలం

జగిత్యాల పట్టణంలో ప్రతీ ఒక్క కుల సంఘానికి స్థలం ప్రభుత్వం తరపున ఇస్తామని ప్రకటించారు. ప్రతీ ఒక్క సంఘానికి జాగా వస్తుందని తెలిపారు. మహిళా సంఘాలకు కూడా రెండెకరాల స్థలంలో భవనం నిర్మించడానికి చొరువ చూపాలని  మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కవిత కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.