mt_logo

కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి: హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి నిన్న సిద్దిపేటలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నిన్న సిద్దిపేటలో చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి. రేవంత్ రెడ్డికి దేవుడు శాపం పెట్టిండు.. ఆయన ఎప్పుడూ నిజాలు మాట్లాడడు. రేవంత్ రెడ్డి సిద్దిపేట అభివృద్ధిని కండ్లు ఉండి చూడలేకపోతున్నాడు.. సిద్దిపేట అభివృద్ధిలో ఎన్నో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు సాధించింది.. సిద్దిపేట పేరు లేకుండా అవార్డులు లేవు అని తెలిపారు.

సిద్దిపేటకు మేము ఏం చేయలేదో రేవంత్ రెడ్డి చెప్పాలి. సిద్దిపేటకి మెడికల్ కళాశాల, పోలీస్ కమిషనర్ కార్యాలయం, ఐటీ హబ్, రైతు బజార్ ఎన్నో తెచ్చాం.. అన్నింటికి మించి తెలంగాణ తెచ్చాం. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు అంటే సిద్దిపేట పుణ్యమే, తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు మోచేతి నీళ్లు త్రాగేవాడు.. నిన్నటి వరకు మెదక్ అభివృద్ధి జరిగింది అని మాట్లాడింది నిజమా.. నేడు సిద్దిపేట అభివృద్ధి జరగలేదు అనేది నిజమా అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ఆగస్టు 15న సిద్దిపేటకి వస్తా అనే సవాల్‌ను స్వీకరిస్తున్న.. నా సవాల్‌ను రేవంత్ రెడ్డి స్వీకరిస్తలేడు. విలువలతో కూడిన రాజకీయం నాకు అలవాటు.. వంద రోజులులో ఆరు గ్యారంటీలు, రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా ఆమోదించుకొని నీకు శాలువా కప్పుత. వ్యక్తిగా నా కంటే కోట్లాది ప్రజలకు న్యాయం జరగడం నేను కోరుకునేది అని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ బౌన్స్ అయింది.. రేవంత్ రెడ్డి రాజీనామాకి సిద్ధమా లేకుంటే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తావా. వంద రోజులలో గ్యారంటీలు అమలు చేస్తే నేను స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తా అని హరీష్ అన్నారు.

ఒకరేమో దేవుణ్ణి చూపించి ఓట్లు అడుగుతారు.. మరొకరేమో దేవుని మీద ఓట్లు పెట్టి ఓట్లు అడుగుతారు.. మీ పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూమి కొనేవారు లేకుండా పోయారు.. రాష్ట్రం దివాలా తీసింది ఆని లేని అప్పులు చూపెడుతున్నారు. నేడు రాష్ట్ర ఆదాయం పడిపోయింది.. ఉద్యోగాలు రాకుండా పోయింది.. రియల్ ఎస్టేట్ పడిపోయింది.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనీ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు.

సిద్దిపేట అభివృద్ధి ప్రజల ముందు కనబడుతుంది.. సిగ్గు లేకుండా మాట్లాడకు రేవంత్ రెడ్డి.. కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంటు ఉంది. కేసీఆర్ బస్ యాత్ర సుపర్ హిట్ కావడంతో కాంగ్రెస్, బీజేపి పార్టీలు నయ నాటకాలు ఆడుతున్నారు.. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్ లేకుండా చేయాలని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఉన్న చోట బీజేపీ డమ్మీ అభ్యర్థిని, బీజేపి అభ్యర్థి బలంగా ఉన్న చోట కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టాయి.. కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉంది అని విమర్శించారు.

రేవంత్ పాలన 5 నెలల్లోనే రివర్స్ గేర్‌లో నడుస్తుంది.. కాంగ్రెస్ 5 నెలలోనే కరెంట్ కోతలు వచ్చాయి.. కళ్యాణ లక్ష్మి చెక్కులు అగాయి, కొత్తవి ఇస్తలేరు కానీ పాత పథకాలు ఆపుతున్నారు. రైతులకు రైతుబంధు ఇవ్వకపోవడంతో రైతులు వడ్డీలకు అప్పు తీసుకుని పంటలు వేసుకున్నారు అని అన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్. రేవంత్ రెడ్డి ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నాడు.. రిజర్వేషన్లు పోతాయని రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నాడు.. హిందువుల ఆస్తులు పోతాయని మోడీ అంటున్నాడు.. హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ ప్రజలు ఊరుకోరు. ప్రజలను సెంటిమెంటల్‌గా రెచ్చగొట్టి కాంగ్రెస్, బీజేపి ఓట్లు అడుగుతున్నారు అని పేర్కొన్నారు.

ఆర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోడీ అంటున్నారు. అది నిజమైతే ఈడీ ఎందుకు రావడం లేదు.. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో రేవంత్ రెడ్డి మాటల్లో అంతా నిజం ఉంటది..కేసీఆర్ ఇచ్చిన సిద్దిపేట వెటర్నరీ కాలేజ్‌ని గద్ద లాగా కొడంగల్‌కి రేవంత్ రెడ్డి లాక్కొని పోయాడు అని విమర్శించారు.

సిద్దిపేట జిల్లాను రద్దు చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడు.. జిల్లాను తీసి అభివృద్ధిని ఆపుతావా రేవంత్.. జిల్లాను తీస్తా అన్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలి అని పిలుపునిచ్చారు.