mt_logo

తరుగు విషయంలో తేడాలు వస్తే సహించేది లేదు : మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరపల్లి మండలం సింగరాజు పల్లె గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు తీరును మంత్రి పరిశీలించారు. రైతులతో కొద్దిసేపు మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ఏ విధంగా సాగుతున్నది అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అధికారులను పిలిచి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. తరుగు విషయంలో తేడాలు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. రైతులు పంటల విషయంలో అకాల వర్షాల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అలాంటి పరిస్థితులలో కూడా రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. పంటల నష్టా లకు పరిహారం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవ్వడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించడం ధాన్యం కొనుగోలు చేయడం తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు దొరకే తీసుకోవడం వంటి చర్యలు దేశంలో ఎక్కడా లేవు అన్నారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే రైతులకు అండగా నిలవాలన్నారు. ఆఖరు గింజ వరకు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రైతులు ఎలాంటి అపోహలకు అనుమానాలకు తావు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులకు సహకరించాలని సూచించారు.