mt_logo

దేశానికే ఆదర్శంగా ఆరోగ్య మహిళ పథకం

వికారాబాద్:  పూడూరు మండలం చెన్ గొముల్‌లో ‘మహిళా ఆరోగ్య కేంద్రం’ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు & గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్తగా అమలవుతున్న ఆరోగ్య మహిళ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మహిళల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ మహిళా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేశారన్నారు. 

రాష్ట్రంలో 372 మహిళా కేంద్రాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పథకం ప్రారంభం కానుందని తెలిపారు. మార్చి 8 ప్రారంభం కావాలి కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో జూన్ 14న ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 372 మహిళా కేంద్రాలు ఏర్పాటు చేసారని స్పష్టం చేశారు.  వికారాబాద్ జిల్లాలో జూన్ 20న ప్రారంభం కానుందని తెలిపారు. ఇప్పటి వరకు దోమ,యాలాల్, రామన్నగూడ కేంద్రాల ప్రారంభం జరిగిందని తెలిపారు. నేడు కొత్తగా బంటారం, మోమిన్పేట,ధారూర్, కోటిపల్లి, చెన్గోముల్ 4 కేంద్రాల ప్రారంభం జరిగిందని తెలియజేశారు. 

43 వేల 320 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లు

ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందుతాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో  ప్రసవించిన మహిళకు 4 విడతలుగా… మగ శిశువుకు 12 వేలు, ఆడ శిశువుకు రూ.13 వేలు, రూ.2800 విలువతో  కేసీఆర్ కిట్‌లో 16 రకాల వస్తువులు తల్లి, బిడ్డ సంరక్షణ కోసం ఇస్తున్నామని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ కిట్లు ఇప్పటివరకు 43 వేల 320 మంది బాలింతలకు అందించామని పేర్కొన్నారు.