mt_logo

మిల్లింగ్ కెపాసిటీ పెంచాలని కేబినెట్ నిర్ణయం – కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అయిన నేపథ్యంలో సాగు నీటి సౌకర్యం, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడికి రైతు బంధు సాయం, రైతు రుణమాఫీ, రైతు బీమా లాంటి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో కోటి ఎకరాల్లో వరి సాగుతో ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తక్షణమే మిల్లింగ్ కెపాసిటీ పెంచాలని కేబినెట్ నిర్ణయం మేరకు ఇందుకోసం కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నేడు జీవో జారీ చేసింది. 

ఈ కమిటీలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా, మరో నలుగురిని సభ్యులగా నియమిస్తూ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది. 

2022-23 వానాకాలం, యాసంగి లో ధాన్యం దిగుబడి కి తగ్గట్టుగా మిల్లింగ్ కెపాసిటీని పెంచడం, అదనపు ధాన్యాన్ని వేలం వేయడానికి అవసరమైన సలహాలు ఈ కమిటీ ఇవ్వాలని జీవో లో పేర్కొంది. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల అభ్యర్థన మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం జీవో లో తెలిపింది. ఐదుగురు సభ్యులున్న ఈ కమిటీ విధివిధానాలను రూపొందించారు తో పాటు ఈ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి కావాలిసిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవోలో సూచించింది.

జీవో లో పేర్కొన్న  సూచనలు ఇవే.. 

• రాష్ట్రంలో మిల్లింగ్ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం. 

• ధాన్యం దిగుబడి ఎంత? సేకరణ ఎంత? ఎంత మిల్లింగ్ సామర్థ్యం, అవసరం వంటి అంశాలపై సమగ్రంగా వివరాలను కమిటీ సేకరించాలి.

• తక్కువ మిల్లులు ఉన్న ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం భూములను గుర్తించడం, 

• ధాన్యం మిల్లింగ్ లో పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి అవసరమైన ఇండస్ట్రీయల్ ఇన్సెంటివ్ పాలసీని తయారు చేయడం

• సత్వరంగా సంవత్సరంలోగా  కొత్త మిల్లులు వచ్చేలా అవసరమైన టెక్నాలజీని  కమిటీ గుర్తించాలి. 

• సామర్ధ్యం ఉన్న పెట్టుబడిదారులను మిల్లింగ్ రంగం వైపు వచ్చేలా ఒప్పించి పరిశ్రమలు నెలకొల్పేలా చూడాలి.

• బియ్యం..వాటి ఉప ఉత్పత్తులు  లాభాల్లోకి  వచ్చేలా అవసరమైన కార్యక్రమాలను కమిటీ తీసుకోవాలి.

• ప్రస్తుతమున్న కస్టమ్ మిల్లింగ్ పాలసీని మార్చి కంపల్సరీ మిల్లింగ్ ను నిర్ణీత పరిణామంలో నిర్ణీత సామర్ధ్యంతో ఉండేలా రూపొందించాలి.

• మిల్లింగ్ కెపాసిటీని పెంచేందుకు మార్గదర్శకాల రూపొందించాల్సిన బాధ్యత 

• ధాన్యం క్వాలిటీని అంచనా వేయడం, మార్కెట్ పరిస్థితులు అనుసరించి నాణ్యత, ధరను నిర్ణయించి ధాన్యం వేలం వేయడం వంటి చర్యలు.. 

• వానాకాలం, యాసంగి కి సంబంధించిన రెండు సీజన్లలో వచ్చే ధాన్యాన్ని అనుసరించి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

• కమిటీ సభ్యులందరూ సమావేశమై ధాన్యం  కనీస ధరను నిర్ణయించాలి. 

• ధాన్యం వేలానికి సంబంధించిన  మార్గదర్శకాలను సిఫారసు తయారు చేయాలి. 

• దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవో లో సూచించింది.