mt_logo

రైతును అప్పులపాలు కానివ్వకుండా కాపాడటమే రైతుబంధు ఉద్దేశం : మంత్రి నిరంజన్ రెడ్డి

శాసనసభలో సభ్యులు అడిగిన పంటనష్టం, రుణమాఫీ, ఫసల్ భీమా యోజనలపై ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమాధానమిస్తూ.. “కేంద్ర పంటల భీమా విధానం మారాలి. ఇన్సూరెన్స్ విషయంలో కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలి. పంటను బట్టి, రైతుని బట్టి ఇన్సూరెన్స్ ఇచ్చే విధానం మీద కేంద్రం ఆలోచించాలి. గుండుగుత్తగా కంపెనీలకు డబ్బులు కట్టడమే తప్ప రైతులకు మేలు జరగడం లేదు. ఇప్పుడున్న బీమాతో రైతుకు కట్టిన ప్రీమియం కన్నా పరిహారం తక్కువ వస్తుంది. వాహన ప్రమాద భీమా, అగ్ని ప్రమాద భీమా తరహాలో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక కొత్త విధానం తేవాలి” అన్నారు.

“ఫసల్ భీమా కింద 2016 – 17, 2017 -18 లకు గాను తెలంగాణ ప్రభుత్వం భీమా ప్రీమియం చెల్లించింది. 2018- 2019, 2019 – 20 కి గాను సగం చెల్లించగా మిగతా డబ్బులు త్వరలోనే చెల్లిస్తాము. గత ఏడాది కేంద్రప్రభుత్వం ఫసల్ భీమా పథకాన్ని అప్షనల్ చేసింది. దీంతో దేశంలోని గుజరాత్, పంజాబ్, ఏపీ, బీహార్, పశ్చిమబెంగాల్ , జార్ఖండ్ , తెలంగాణ రాష్ట్రాలు దీన్నుండి వెనక్కు వెళ్లాయి. రైతుకు డైరెక్టుగా సహాయపడేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు కింద పెట్టుబడి సాయం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ. రైతులు అప్పుల నుండి బయట పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రైతును మరింత ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిపించాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తోందని” పేర్కొన్నారు.

“రాష్ట్రంలో ఈ వానాకాలం కురిసిన సాధారణ వర్షపాతం 720.40 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు 1009.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మొత్తంగా చూసుకుంటే 35 శాతం అధిక వర్షపాతం నమోదయింది. జూలై నెలలో ఒక్క రోజు మాత్రమే 19 జిల్లాలలో అతిభారీ వర్షపాతం నమోదయింది. అలాగే సెప్టెంబరు నెలలో ఒక్క రోజు మాత్రమే 18 జిల్లాల్లో నమోదయింది. ఇది మినహాయిస్తే తెలంగాణ మొత్తం సాధారణ వర్షపాతమే నమోదయింది. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం జూలై, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యవసాయ అధికారులు వివరించారు. వర్షం మూలంగా నీట మునిగిన చోట చాలా వరకు మరుసటిరోజుకు నీళ్లు వెళ్లిపోతాయి. కొన్ని చోట్ల మాత్రమే రైతులు కొత్త పంటలను వేసుకుంటారు. దీనికి మొత్తం పంట నష్టం జరిగింది అనే అన్వయింపు సబబు కాదు. దేశంలో భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం వ్యవసాయ శాఖ ఏ వర్షానికి నష్టాలు అంచనా వేయాలో కొన్ని ప్రామాణికతలు ఇచ్చిందని” సభకు తెలిపారు.

“52.5 శాతం రాష్ట్రంలో కౌలురైతులు ఉన్నారన్న వాదన శుద్ద తప్పు. రాష్ట్రంలో రైతులందరి వివరాలు వ్యవసాయ శాఖ వద్ద నమోదై ఉన్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇన్ని వివరాలు ఇంత శాస్త్రీయంగా లేవు. 92.5 శాతం రైతాంగం సన్న, చిన్న కారు రైతులు ఉన్నారు కానీ సగం మంది కౌలు రైతులు అనడం కరెక్ట్ కాదు. ఒకవేళ విపక్షాల వద్ద కౌలు రైతుల వివరాలు ఉంటే సభకు సమర్పించాలి. కౌలు రైతులు ఉన్నాగానీ ఏడాదికేడాదికి ఒప్పందాలుంటాయి. అంతేగానీ ఆంధ్రప్రదేశ్ మాదిరిగా అచ్చంగా కౌలు రైతుల పరిస్థితి తెలంగాణలో ఉండదు. ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదన్న మల్లు భట్టి విక్రమార్క ఆరోపణ తప్పు. 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో బకాయి ఉన్న ఇన్ ఫుట్ సబ్సిడీ రూ.668 కోట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. 4.36 లక్షల మంది రైతాంగానికి రూ.50 వేల వరకు రుణమాఫీ రూ.843.62 కోట్లు చెల్లించడం జరిగింది. మరో రూ.1570.61 కోట్ల రుణమాఫీ 4.61 లక్షల మంది రైతులకు త్వరలో చెల్లిస్తాము” అని మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *