mt_logo

మ‌హిళ‌ల అభివృద్ధితోనే దేశ ప్ర‌గ‌తి : మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్, మే 23:  మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పదేండ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి గారు అధికారులను ఆదేశించారు. డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం అధికారులతో, డాక్యుమెంటరీ ఏజెన్సీ సిబ్బంది తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే 21 రోజుల దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంగన్ వాడీలు, మహిళా సమాఖ్యల వద్ద కార్యక్రమాలు చేపట్టాలని మహిళా సంక్షేమ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేశారని మంత్రి స్పష్టం చేశారు. మ‌హిళ‌ల అభివృద్ధితోనే దేశ ప్ర‌గ‌తి, పురోగ‌తి జ‌రుగుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషుడి కంటే ధీటుగా రాణిస్తున్నారని అన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ టీమ్, సఖి, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంగన్వాడిల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని అన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా మ‌హిళ‌ల సాధికార‌త కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తుందని, దశాబ్ది ఉత్సవాలలో గ్రామీణ స్థాయి నుండి ఈ అంశాలను ప్రజలకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ గారు తెలిపారు. త్వరితగతిన డాక్యుమెంటరీ పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.