
హైదరాబాద్, జూన్ 16: పట్టణాలు దేశ ప్రగతికి మెట్లు. పిల్లల చదువుల కొరకు, ఆరోగ్య అవసరాలకు, జీవనోపాధికి, ఉన్నత జీవన విధానాలకు ప్రజలు పట్టణాలకు తరలి వస్తుంటారు. దేశ జనాభాలో 35 .1 % పట్టణాల్లో నివసిస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో 47.6 % జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు. ఇది దేశ పట్టణ జనాభా కన్నా 12 .5 % అధికం. పెరుగుతున్న జనాభా, మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణాలు అభివృద్ధి చేయడం ఛాలెంజ్ లాంటిది. పట్టణాల సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నివాసయోగ్యమైన వాతావరణాన్ని కలిపించాలని 2020లో పట్టణ ప్రగతి పేరిట వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ పట్టణం తో పాటు అన్ని నగరాలు పట్టణాల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నేడు రాష్ట్ర పట్టణాల రూపు రేఖలే మారిపోయాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్ రావు దిశానిర్ధేశంలో, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు నేతృత్వంలో 9 సంవత్సరాల్లోనే తెలంగాణ పట్టణాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి పురోగమిస్తున్నాయి. కేంద్రం నుండి 23 పట్టణ స్థానిక సంస్థలకు స్వచ్ సర్వేక్షణ్ అవార్డులు, 3 పట్టణ స్థానిక సంస్థలకు ఇండియన్ స్వచ్ఛత లీడ్ అవార్డులు లభించాయి. పట్టణీకరణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ స్థిరత్వ సూచిక 2021 ప్రకారం హైదరాబాద్ ఆసియా పసిఫిక్ ప్రాంతం లోని మొదటికి 20 స్థానాలలో స్థిరమైన నగరంగా పేర్కొన్నది అదేవిధంగా భారతీయ నగరాల్లో మూడవ స్థానంలో వుంది. ఐక్య రాజ్య సమితిలోని అర్బర్ డే ఫౌండేషన్ మరియు ఆహార & వ్యవసాయ సంస్థ వరుసగా రెండు ఏండ్లు హైదరాబాద్ ను ప్రపంచ వృక్ష నగరం-2021 గుర్తించింది. దక్షిణ కొరియాలోని జెజు లో నిర్వహించిన అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తుల సంఘం హైదరాబాద్ కు ప్రపంచ హరిత నగరం 2022 అవార్డు ను ప్రకటించింది. ఇలా రాష్ట్రం అనేక అవార్డులు కైవసం చేసుకుంటోంది. ఇతర రాష్ట్రాల బృందాల అధ్యయనం చేసేందుకు రాష్ట్రానికి వచ్చే స్థాయికి తెలంగాణ ఎదిగింది.
రాష్ట్రంలో 129 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్ లు, జీహెచ్ఎంసీ తో కలిపి మొత్తం 142 పట్టణ ప్రాంతాల్లోన 3618 వార్డులలో కోటి నలభై నాలుగు లక్షల జనాభా నివసిస్తోంది. పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టిన పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.4537 .79 కోట్లు విడుదల చేయగా ఇప్పటికే రూ.4138 .84 కోట్ల నిధులని ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణాలలో మౌలిక సదుపాయాలు , రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణం నిర్వహణ , విద్యుత్ దీపాలు, పార్కుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ , హరిత హారం, డంపింగ్ యార్డ్స్, వ్యర్థాల రీసైక్లింగ్, వైకుంఠధామాలు, ఓపెన్ జిమ్, క్రీడా ప్రాంగణాలు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్,సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు , సకాలంలో నిధులు విడుదల తదితర అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ పట్టణాలు విరాజిల్లుతున్నాయి. ఏ ఆసరా లేని అనాధలకు ఆశ్రయం కల్పించేందుకు 30 షేల్టర్లను ఏర్పాటు చేసింది. విద్యుత్ ఆదా చేసే ప్రయత్నంలో 9,11,234 ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేసి ఏడాదికి రూ.128 కోట్ల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం ఆదా చేసింది.

పారిశుధ్యం:
ఆరోగ్య జీవన విధానంలో పారిశుధ్యం ప్రధానమైనది. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిహెచ్ఎంసి మినహా ఇతర పట్టణ స్థానిక సంస్థలలో చెత్త రవాణాకు 4713 వాహనాలు ఏర్పాటు చేసి రోజుకు 4356 టన్నుల చెత్తను తరలిస్తున్నారు. ఇందుకు వివిధ ప్రాంతాలలో 1233 .27 ఎకరాలలో 141 డంపింగ్ యార్డ్స్ ను ఏర్పాటు చేసారు. ఘన వ్యర్ధ పదార్థాల నిర్వాహణకు 229 కంపోస్ట్ షెడ్స్ ను ఏర్పాటు చేసి ఎరువు తయారుచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 100 % చెత్తను సేకరిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించింది. . 141 పట్టణ స్థానిక సంస్థలలో రూ.428 .02 కోట్లతో 139 మానవ వ్యర్ధాల ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసారు, మరో 14 నిర్మాణంలో ఉన్నాయి.

రాష్ట్రం హరితవనం:
పర్యావరణ పరీక్షణకు చేపట్టిన హరితహారం కార్యక్రమం కింద 3618 వార్డులలో 1612 నర్సరీలను ఏర్పాటు చేసారు. ఈ ఏడాద 214,91 లక్షల మొక్కల లక్ష్యం కాగా ఇప్పటికే నర్సరీలలో 248.38 లక్షల మొక్కలను పెంచుతున్నారు. గత ఏడాద నిర్ధేశించుకున్న 251 .60 మొక్కల లక్ష్యానికి మించి 252 .27 మొక్కలను 141 పట్టణ స్థానిక సంస్థలలో నాటి 100 % లక్ష్యాన్ని పూర్తి చేసారు. 2818 పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా ఈ ఏడాది మార్చి చివరి నాటికి రోడ్లకు ఇరువైపులా 1208.52 కిలోమీటర్ల మేర 19.98 లక్షల మొక్కలను నాటారు. 2020 -21 నుండి 2023 -21 వరకు మొత్తం రూ.778 .33 కోట్ల గ్రీన్ బడ్జెట్ ను కేటాయించారు. ఉద్యోగులు , వ్యాపారాలు గత ఏడాది రూ.143.25 లక్షలు హరిత నిధికి జమ చేసారు.

ఆహ్లాదం ఆరోగ్యం:
ప్రజల ఆరోగ్యం అదే విధంగా ఆహ్లాదానికి పార్కలతో పాటు 368 ఓపెన్ జిమ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా 1273 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది.
వెజ్ నాన్ జ్ మార్కెట్ల ఏర్పాటు:
ప్రజలకు అనుకూలంగా ఒకే చోటు కూరగాయలు పండ్లు, పూలు, మాంసం, చేపలు లభించాలని ఉద్దేశంతో రూ.500 కోట్ల బడ్జెట్ ను కేటాయించి సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. 25 వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న 57 పట్టణాల్లో ఒక్కోటి రెండు కోట్లతో, 25 వేల కన్నా అధికంగా ఉన్న 81 పట్టణాల్లో రూ.4.50 కోట్లతో ఈ మార్కెట్లను నిర్మిస్తున్నారు.

వైకుంఠధామాలు:
మనిషి చనిపోయాక గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలనే సంకల్పంతో వైకుంఠ రథాలు, వైకుంఠధామలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 141 పట్టణ స్థానిక సంస్థలలో 453 లక్ష్యంగా ఇప్పటికే 304 వైకుంఠధామాలు నిర్మించారు. 176 వైకుంఠ రథాలను ఏర్పాటు చేసారు.
తెలంగాణ రాష్ట్రంలో పురపాలక శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల బృందాలు అధ్యయనం చేసేందుకు రాష్ట్రానికి వచ్చే స్థాయికి తెలంగాణ పట్టణాలు ఎదిగి అభివృద్ధికి చిహ్నాలుగా మారాయి.
