mt_logo

రాష్ట్రంపై చేసిన విమర్శలకు “తెలంగాణ ప్రగతి పథం” సరియైన సమాధానం ఇస్తుంది: సీఎం కేసీఆర్ 

రాష్ట్రంపై చేసిన విమర్శలకు “తెలంగాణ ప్రగతి పథం” సరియైన సమాధానం ఇస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరియు రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే దేశానికే తలమానికంగా నిలవడం అంత తేలికైన విషయం కాదని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని  నీటి పారుదల శాఖ, పరిశ్రమల శాఖ, వైద్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ, పట్టణ మౌలిక సదుపాయాల శాఖ, ఐటీ శాఖ, ఆర్థిక శాఖ, వివిధ శాఖలలోని ప్రగతి వివరాలు పొందుపరిచిన “తెలంగాణ ప్రగతి పథం” కాఫీ టేబుల్ బుక్ ను సోమవారం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహచర మంత్రులు, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, ఆర్థిక కార్యదర్శి శ్రీదేవి తదితర అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు.  

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మన పాలనా సామర్థ్యంపై విమర్శలు ఎక్కుపెట్టిన వారికి నేటి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “తెలంగాణ ప్రగతి పథం” పుస్తకం సరియైన సమాధానాలను ఇస్తుందని అన్నారు. రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి శిఖరాలకు చేరుకున్న తీరు యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిందని సీఎం పేర్కొన్నారు.