- సీఎం కేసీఆర్ సంకల్పంతో తొమ్మిదేండ్లలోనే సీన్ రివర్స్
- తెలంగాణ సర్కారును ప్రశంసించిన జర్మనీ అగ్రికల్చర్ బృందం

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో విత్తనాల కొరత.. సాగునీళ్లు లేక… కరెంటే కటకటతో కష్టాలపాలయ్యే రైతుకు విత్తనాల కొరత అదనపు ఆవేదన. విత్తనాల కోసం క్యూలైన్లో నిలబడాల్సిన దుస్థితి. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంకల్పంతో తొమ్మిదేండ్లలోనే సీన్ రివర్స్ అయ్యింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు విత్తన కంపెనీలు తమ ఎగుమతులను పెంచుకొనేందుకు తెలంగాణ తీసుకొన్న సరికొత్త చర్యలతో నేడు తెలంగాణ అంతర్జాతీయ సీడ్ హబ్గా మారింది. జర్మనీ వ్యవసాయ శాఖ బృందం ప్రశంసలు అందుకొన్నది. జీ-20 వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఈ బృందం బుధవారం రాజేంద్రనగర్లో తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థకు చెందిన అంతర్జాతీయ విత్తన పరీక్ష ల్యాబ్ (టిస్టా)ను సందర్శించింది. తెలంగాణలో విత్తనరంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం బాగున్నదని, విత్తన పరిశ్రమ అభివృద్ధికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉన్నదని కొనియాడింది. తెలంగాణ అంతర్జాతీయ సీడ్ హబ్గా ఎదిగిందని ప్రశంసించింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో సమావేశమై మన మాడల్పై అవగాహన పెంచుకొన్నది.

టిస్టా చూసి ఆశ్చర్యపోయిన జర్మనీ బృందం
స్థానిక రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు విత్తన కంపెనీలు తమ ఎగుమతులను పెంచుకొనేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన టిస్టాను చూసి జర్మనీ వ్యవసాయ శాఖ బృందం ఆశ్చర్యపోయింది. విత్తన ఎగుమతులను ప్రోత్సహించేందుకు తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో టిస్టాను ఏర్పాటు చేయటం అభినందనీయమని పేర్కొన్నది. ఇండో-జర్మన్ సహకార ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి సహకారం అందించామని, భవిష్యత్లోనూ ఈ సహకారాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అన్నదాతలను ఆదుకొంటున్న తీరు బాగుందని కితాబిచ్చింది.