- పేద బ్రాహ్మణులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
- సర్వజన హితం సర్వజనుల సుఖం బ్రాహ్మణుల యొక్క లక్ష్యం
- ఏడాదికి వందకోట్ల రూపాయలు ‘బ్రాహ్మణ పరిషత్’ నిధులు
![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2023/06/kcr-bramhana-sadan4-1.jpg?resize=1024%2C514&ssl=1)
బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. బ్రాహ్మణ సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారి కోసం ఒక కేంద్రం ఏర్పాటు కావడం దేశంలోనే ప్ర ప్రథమం. అన్ని రంగాల మాదిరే బ్రాహ్మణ సంక్షేమంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆ కార్యక్రమాన్ని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కె వి రమణాచారి సభను ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కోరగా. .సీ ఎస్ ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమైంది. అనంతరం ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కేరళకు చెందిన ప్రదీప్ జ్యోతి మాట్లాడారు. దేశంలోనే మరెక్కడాలేని విధంగా అత్యంత గొప్పగా బ్రాహ్మణ సంక్షేమం కోసం కృషి చేస్తున్నఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సమాజ సంక్షేమం పట్ల ఆలోచన చేస్తూ పలు పథకాలను అమలు చేస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారేనని స్పష్టం చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభం సందర్భంగా తన సందేశాన్ని ఇచ్చారు.
‘బ్రాహ్మణ సంక్షేమ సదనం’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..
సభలో ఆశీనులైన విప్రవర్యులు, బ్రాహ్మణోత్తములందరికీ వందనాలు తెలియజేసారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల నుంచి విచ్చేసిన అర్చకులకు ఈ పవిత్ర తెలంగాణ భూమి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను, బ్రహ్మజ్ఞాన వాస్తు బ్రాహ్మణ.. అని నిర్వచనం చెప్పారు పెద్దలు… బ్రహ్మజ్ఞానం పొందిన వారికెవరికైనా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని అన్నారు. వేద వాజ్మయాన్ని లోకానికి అందించేవారే విప్రులు… సర్వజన హితం సర్వజనుల సుఖం బ్రాహ్మణుల యొక్క లక్ష్యం అన్నారు. పురం యొక్క హితం కోరేవారే పురోహితులని, లోకా సమస్త సుఖినోభవన్తు అన్నది బ్రాహ్మణుల నోట పలికే జీవనాదర్శం అని తెలిపారు. బ్రాహ్మణుల మనసు, మాటా, చేసే పని లోకహితం కోసమే, తెలంగాణ ప్రభుత్వ విధానం సర్వజన సమాదరణ, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే.
![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2023/06/Untitled-Project-12.jpg?resize=1024%2C576&ssl=1)
కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లోనూ ఎందరో పేదలున్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించిందని అన్నారు. ‘తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్’ ను తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 1న ఏర్పాటు చేసింది, ఏడాదికి వందకోట్ల రూపాయల నిధులను ‘బ్రాహ్మణ పరిషత్’ కు కేటాయిస్తున్నాం. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు… ఇప్పటివరకూ 780 మంది విద్యార్థులు ‘వివేకానంద స్కాలర్షిప్’ ద్వారా ఆదుకోబడ్డారు, పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బెస్ట్ (బ్రాహ్మణ ఎంపవర్మెంట్ స్కీం ఆఫ్ తెలంగాణ స్టేట్) అనే పథకం అమలవుతున్నది. ఈ పథకం కింద పెట్టుబడి సాయం కింద గరిష్టంగా రూ.5 లక్షల గ్రాంటును ప్రభుత్వం అందిస్తున్నది. ఇందుకోసం ఇప్పటివరకూ రూ.150 కోట్లను ప్రభుత్వం వెచ్చించిందన్నారు. ‘విప్రహిత బ్రాహ్మణ సదనం’.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 9 ఎకరాల స్థలంలో రూ.12 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా ‘బ్రాహ్మణ సంక్షేమ సదనం’ నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది, ఈ విధంగా ఇంత ఖర్చుతో సనాతన సంస్కృతి కేంద్రంగా బ్రాహ్మణ సదనం ను నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శిగా, కేంద్రంగా నిలుస్తుంది, రాష్ట్రానికి విచ్చేసే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం సేవలు అందించబడుతుందన్నారు.
పేద బ్రాహ్మణ కళ్యాణాలకు ఉచితంగా ఇచ్చే వేదికగా ఈ భవనంలోని కళ్యాణ మండపం ఉపయోగపడుతుంది, కులమతాలకు అతీతంగా పేదవాళ్లు ఎవరైనా సరే తమ ఇంట్లో శుభాశుభ కార్యక్రమాల కోసం పురోహితుల సేవలను కోరితే ఈ సదనం నుండి పురోహిత బ్రాహ్మణులు వెళ్లి ఉచితంగా వారి ఇంట్లో కార్యక్రమాన్ని జరిపించి రావాలని నేను కోరుతున్నానన్నారు. ఆ విధంగా విప్రహిత, సకల జనహితగా సమాదరింపబడాలని, విఖ్యాతి పొందాలన్నదే నా వ్యక్తిగత అభిమతమని అన్నారు. వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలు, దేవతా ప్రతిష్టలు వివిధ వ్రతాలకు సంబంధించిన ఒక సమగ్రమైన లైబ్రరీ ఈ సదనంలో ఏర్పాటు కావాలని కోరుతున్నాను. ఆయా వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు ఈ లైబ్రరీలో లభిస్తాయని తెలిపారు.
వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా, ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా, నిత్యం భారత, భాగవత, రామాయణాది కావ్య ప్రవచనాలకు వేదికగా, కళలకు కొలువుగా బ్రాహ్మణ సదనం విలసిల్లాలి, సూర్యాపేటలో డాక్టర్ ఎ.రామయ్య గారు వదాన్యతతో ఇచ్చిన ఒక ఎకరం స్థలంలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. దీనిని త్వరలోనే ప్రారంభించుకుందామని సంతోషంగా నేను తెలియజేస్తున్నాను, ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతంలో కూడా బ్రాహ్మణ భవనాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తూ ఉన్నది. తన సంజీవని వ్యాఖ్యతో మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథ సూరి పేరున ఆ మహనీయుని స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వ విద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుందని మీ అందరి హర్షామోదాల మధ్య తెలియజేస్తున్నానన్నారు.