
తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వేతనాలు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ ఉద్యమ కళాకారుల కుటుంబాలకు స్వరాష్ట్రంలో భరోసా కల్పించేందుకు వారికి ప్రభుత్వ పరంగా సాంస్కృతిక సారథి సంస్థ ను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించడం దేశ చరిత్రలో మొదటిసారి.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను సీఎం కేసీఆర్ గుర్తించి 583 మందికి ఉద్యోగాలు కల్పించారు. ప్రతి నెల వారికి రూ. 24,514 రూపాయల భృతిని కల్పించారు. సంక్షేమంలో భాగంగా కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అదనంగా 30 శాతం వేతనం పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెరిగిన వేతనాల ప్రకారం వీరికి ఇకనుండి నెలకు రూ. 31868/- అందనున్నాయి. సీఎం ఆదేశాల మేరకు కొత్త వేతనాలు జూన్ 1, 2021 నుండి వర్తించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తమ గళాల్ని, కలాల్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన కళాకారులకు 2015 లో ఉద్యోగాలిచ్చారు. అప్పటి నుంచి వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కళాకారులు ప్రభుత్వ ప్రగతి గీతాలను ఆలపిస్తూ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పథకాలను ప్రజల వద్దకు చేర్చి వాటిని సద్వినియోగం పరుచుకొనే దిశగా చైతన్యం చేస్తూ కీలక భూమిక పోషిస్తున్నారు.
వీరి కృషిని గుర్తించిన సీఎం గారు కళాకారుల వేతనాలను పీఆర్సీ-2020 పరిధిలోకి తెచ్చి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు వర్తింపజేయడం గొప్ప విషయం. కళాకారుల ఆర్థిక స్థాయిని మెరుగు పరుచడంతోపాటు సామాజిక భద్రతకు వేతనాల పెంపు నిర్ణయం దోహదం చేస్తోంది. వేతనాల పెంపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. వేతనాలు పెంచినందుకు గౌరవ సీఎం కేసీఆర్కి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారికి కళాకారులు ధన్యవాదాలు తెలిపారు.