mt_logo

వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్ సర్కార్..  తెలంగాణాలో  కొత్తగా 17 బీసీ డిగ్రీ గురుకులాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

  • ఈ ఏడు 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు ప్రారంభం
  • 19 నుండి 327 కు పెరిగిన బీసీ గురుకులాలు
  • నూతన డిగ్రీ కాలేజీల ద్వారా 16,320 మంది విద్యార్థులకు ఉన్నత విద్య
  •  ప్రతి ఏటా దాదాపు 2లక్షల మంది బీసీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి గురుకుల విద్య

వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనం అన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణకు పూర్వం కేవలం 19 బీసీ గురుకులాలు అరకొర వసతులతో ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో వాటిని నేడు 327 కు పెంచుకున్నాము, విద్య ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని నమ్మే సీఎం కేసీఆర్, అందుకోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారన్నారు. కేవలం బీసీ గురుకులాల ద్వారానే రాష్ట్రంలో దాదాపు 2లక్షల మంది వెనుకబడిన బిడ్డలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యనభ్యసిస్తారని ఆనందం వ్యక్తం చేసారు మంత్రి. 

నూతన డిగ్రీ కాలేజీల్లో 16,320 మందికి లబ్ది 

గత సంవత్సరమే 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసుకుని క్లాసులు ప్రారంభించుకున్నామని వాటి ద్వారా 15,360 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, ఈ సంవత్సరం ప్రారంభించే డిగ్రీ కాలేజీల్లో 16,320 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. కేవలం డిగ్రీ గురుకులాల్లోనే 31,680 మందికి ప్రపంచస్థాయి విద్యను అందిస్తామన్నారు మంత్రి గంగుల. ఈ నూతన డిగ్రీకాలేజీలతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటవుతుందన్నారు.

ఈ ఏడు ప్రారంభించబోయే బీసీ డిగ్రీ గురుకులాల్ని జోగులాంబ గద్వాల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమురం బీం అసిఫాబాద్, మంచిర్యాల,  పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.