
- సమయపాలన లో బెస్ట్ ఎయిర్ పోర్ట్
- మార్చి నెలలో 90.43 శాతం విమానాలు ఆన్టైమ్లో పర్ఫార్మెన్స్
- రెండింటిలోనూ మొదటి స్థానంలో నిలిచింది
- కొత్త టెక్నాలజీలు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు సొంతం
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తూ.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సమయపాలన కలిగిన విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ప్రముఖ ఏవియేషన్, ట్రావెలింగ్ అధ్యయన సంస్థ ‘సీరియం’ ఇటీవల విడుదల చేసిన నివేదికలో సమయపాలన పాటిస్తున్న ఎయిర్పోర్టుల్లో ఆర్జీఐఏ మొదటి స్థానాన్ని దక్కించుకున్నదని వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నెలలో 90 శాతం విమానాలు ఆన్టైమ్లో గమ్యస్థానాలకు చేరుకున్నట్టుగా పేర్కొంది. ఎయిర్పోర్టు నుంచి జరిగిన రాకపోకల్లో డిపార్చర్ పరంగా ఆన్టైమ్ పెర్ఫార్మెన్స్ 90.43 శాతంగా నమోదైనాట్లు తెలిపింది. ఈ ఏడాది మార్చి నెలలో ‘సీరియం ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్లకు పైగా విమానాలను సమీక్షించగా.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ‘గ్లోబల్ ఎయిర్ పోర్ట్’, ‘లార్జ్ ఎయిర్పోర్ట్’ విభాగాల్లో రెండింటిలోనూ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది నవంబర్లో వచ్చిన రిపోర్టులో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఓటీపీ 88.44 శాతంగా ఉన్నది. అప్పుడు 4 వ స్థానంలో ఉంది.
దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సెంట్రలైజ్డ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్, ఆధునిక ప్రయాణీకుల సమాచార వ్యవస్థలు, ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ చెక్-ఇన్, సెల్ఫ్ చెకిన్ కియోస్లు, ఈ-బోర్డింగ్, వీడియో అనలిటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు సొంతం. ఇవి ఆన్టైమ్ పెర్ఫార్మెన్స్ను (OTP) ప్రభావితం చేసే అంశాలేనని ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. ఐతే ఈ జాబితాలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో ఉంది. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. ప్రయాణికులు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చేయడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శనం అని అన్నారు .