mt_logo

దివ్యాంగులకు రూ.4,016 పింఛను.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

దేశానికే ఆదర్శంగా మానవీయ కోణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలచింది. తెలంగాణ ప్రభుత్వం అభాగ్యులైన, ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని మరింతగా పెంచింది. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్ ను పెంచబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ ను రూ. 1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు, ఇక మీదట 4,016 పెన్షన్ ను అందుకుంటారు. ఈ నెల నుండి అమలులోకి వస్తుందని ప్రభుత్వం జీవో లో పేర్కొంది.  దీని ప్రకారం 5 లక్షల పైగా దివ్యాంగ పించనర్లు లబ్ధి పొందనున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

దివ్యాంగుల పింఛన్లు పెంచడం పట్ల ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో వేరెక్కడ లేనివిధంగా అత్యధిక పింఛన్లు అందిస్తూ దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.