mt_logo

హరీష్ రావును కలిసిన రీజనల్ రింగ్ రోడ్ బాధితులు, రైతులు

రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) బాధితులు, రైతులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని, ఎన్నికల తర్వాత మాట తప్పిన వైఖరిని బాధితులు హరీష్ రావుకు వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట తప్పి, నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు నిర్వహిస్తున్నారని, భూసేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారని తమ బాధను బాధితులు వెలిబుచ్చారు.

భూసేకరణ చట్టం అమలు చేయకుండా, తక్కువ ధరకే భూములు లాక్కునే కుట్ర చేస్తున్నారని.. తమ సమస్య పట్ల ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని బాధితులు కోరారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఉత్తర దిక్కు ఆర్ఆర్ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని ప్రియాంక గాంధీ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బాధితులకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గారి చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యం అని అన్నారు.

ఆర్ఆర్ఆర్ ఏర్పాటు విషయంలో ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు బదులుగా 28 కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకోవడం వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని పేర్కొన్నారు.

మధ్య నుండి రోడ్డు వెళ్లడం వలన మున్సిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతున్నది. బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలను, ఇండ్లు, ప్లాట్లను కోల్పోతున్నా ప్రభుత్వం కనికరించడం లేదు. చౌటుప్పల్ వద్ద జంక్షన్ రింగు గతంలో 78 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు 184 కు పెంచడం వల్ల పేదల భూములు, ప్లాట్లు కోల్పోతున్నారు. దీనికి గాను నష్టపరిహారం కూడా తక్కువ చెల్లిస్తున్నారు అని విమర్శించారు.

ఎంపీగా ఉన్నపుడు కోమటిరెడ్డి గారు బాధితులతో కలిసి ఆర్ఆర్ఆర్ మార్చాలని, రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నాలు చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ అలైన్మెంట్ మార్చుతామని హామీలు ఇచ్చారు. కానీ, ఇప్పుడేమో అదే పోలీసు బలగాలతో, నిర్బంధంగా రోడ్డుకు 28 కిలోమీటర్ల పరిధిలోనే సర్వే చేయించి, ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టాలని బలవంతపెట్టడం దుర్మార్గం అని హరీష్ రావు అన్నారు.

రైతులను కాదని సర్వేలు నిర్వహించడం, వారిని భయబ్రాంతులకు గురిచేయడం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం. మోసం చేయడం. నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నారు. గిరిజనుల బిడ్డలను జైళ్ల పాలుచేశారు అని ఆరోపించారు.

నాడు ఆర్ఆర్ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, అన్నారు నేడు మాట మార్చి, నిర్బంధాల మధ్య భూసేకరణ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారూ.. మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్దతా అని అడిగారు.

భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ గారితో.. ఆర్ఆర్ఆర్ భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పించారు. కానీ, అధికారంలోకి రాగానే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.. వేధిస్తూ దాడులకు దిగుతున్నారు అని అన్నారు.

ఇప్పటికైనా కళ్లు తెరిచి హామీ అమలు చేయండి. లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదు. దక్షిణ దిక్కున 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకున్నట్లుగానే, ఉత్తర భాగాన పరిగణలోకి తీసుకోవాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భూములు కోల్పోతున్న రైతులకు సంతృప్తి కలిగేలా పరిహారం అందించి, వారి పూర్తి అంగీకారంతో భూసేకరణ జరపాలని ఈ విషయంలో ప్రభుత్వం దిగిరాకుంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం అని తెలిపారు.

రోబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాధితుల గొంతును వినిపిస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సమస్య పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని స్పష్టం చేశారు.