తెలంగాణలో పట్టుకోసం టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రోజురోజుకూ దిగజారిపోతున్నారు. తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి బాట పట్టించిన బీఆర్ఎస్ సర్కారుపైన, సీఎం కేసీఆర్పైన ఇష్టమొచ్చినట్టు అవాస్తవాలు, అసత్యపు ఆరోపణలు చేస్తున్న రేవంత్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి శవరాజకీయాలకు పాల్పడుతున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా గద్దర్ మరణాన్ని రాజకీయంగా వాడుకొనేందుకు ప్రయత్నించగా..నెటిజన్లు, తెలంగాణ సమాజం ఆయనపై విరుచుకుపడుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..శాసన సభలో గద్దర్కు నివాళులు అర్పించలేదని బొంకారు. కానీ.. నిండు అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ తన ప్రసంగాన్ని ఆపేసి మరీ గద్దర్ మరణవార్తను ప్రకటించారు. గద్దర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్విట్టర్లో పెట్టి రేవంత్ చెంప చెల్లుమనిపించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు లేనిదే మంత్రి కేటీఆర్ సభలో గద్దర్ మరణవార్త ప్రకటించారా? అని టీపీసీసీ చీఫ్ను నిలదీశారు.
బట్టకాల్చి మీదేస్తున్న రేవంత్!
తెలంగాణ సర్కారుపైన, సీఎం కేసీఆర్పైన తన్ స్వలాభం కోసం అవాకులు చవాకులు పేలుతున్న రేవంత్.. గద్దర్ మరణవార్తను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని బట్టకాల్చి మీదేశారు. అసలు విషయం ఏంటంటే గద్దర్ మరణవార్త తెలియగానే సీఎం కేసీఆర్ సభలో ఆయనకు సంతాపం ప్రకటించేలా ఆదేశాలివ్వడమే కాకుండా..ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే మంత్రి కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎల్బీ స్డేడియంకు వెళ్లి గద్దర్కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, భరోసా కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోనుకూడా నెటిజన్లు రేవంత్కు ట్యాగ్ చేసి తగిన బుద్ధి చెప్పారు. ఇది సంకుచిత రాజకీయాలకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనివ్వబోమని హెచ్చరించారు.