
వ్యవసాయం చేసే రైతుకే కరెంట్ కష్టం తెలుస్తుంది, రైతే రాజావ్వలనే నినాదం నిజం చేసే విధానంగా అడుగులు వేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఏ రాష్ట్రంలో అయిన అభివృద్ధి స్థాయిని కొలిచే అత్యంత ముఖ్యమైన సూచికలలో విద్యుత్ వినియోగం ఒకటి. ఆర్థిక వృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. విద్యుత్ అనేది మౌలిక సదుపాయాలలో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి, రాష్ట్ర సంక్షేమానికి ఎంతో ముఖ్యమైనది. తెలంగాణ ఆవిర్భవించిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగిన అద్భుతమైన కృషివల్ల నేడు తెలంగాణ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 18,567 మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యుత్తురంగ బలోపేతం కోసం, కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం 39,321 రూపాయలను ఖర్చు చేసింది.
వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్
తెలంగాణ రాష్ట్రంలోని 27.49 లక్షల వ్యవసాయ మోటర్లకు 24 గంటల ఉచిత సరఫరాను ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో అందిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 8 లక్షల వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా పేద వర్గాల ప్రజలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం ద్వారా 6,00,258 మంది SC వినియోగదారులకు, 3,26,385 ST వినియోగదారులకు ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తోంది. అదేవిధంగా వృత్తినే ఉపాధిగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న 30, 013 మంది నాయీ బ్రాహ్మణుల వినియోగదారులకు మరియు 55,458 ధోభి ఘాట్లు/లాండ్రీ దుకాణాలకు ప్రతి నెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 5467 పౌల్ట్రీ ఫారాలకు , 6097 పవర్ లూమ్లకు యూనిట్ కి రూ.2. సబ్సిడీని అందిస్తున్నది.
వ్యవసాయానికి 24 గంటలూ నాణ్యమైన విద్యుత్
దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాని అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ముందుకుసాగుతున్నది. రాష్ట్రంలోని 27.49 లక్షల మంది రైతులు 24 గంటల ఉచిత విద్యుత్ ను పొందుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు అంతులేని కరెంటు కోతలు, పవర్ హాలిడేల నుండి ఆనతి కాలంలోనే తెలంగాణ శాశ్వత విముక్తిని సాధించింది. 2014లో రాష్ట్ర స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడు 18,567 మెగావాట్లకు పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ని బలోపేతం చేయడానికి 18,874 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అదేవిధంగా మెరుగైన విద్యుత్ పంపీణి నెట్వర్క్ పునరుద్దరించడానికి పల్లె ప్రగతి కార్యక్రమం కింద రూ.506 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.249 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం డిస్కమ్ ల ద్వారా 1062 కొత్త 33/11KV సబ్-స్టేషన్లు, 3.89 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 1.83 లక్షల కి.మీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఏర్పాటుచేయడం జరిగింది. రాష్ట్రప్రభుత్వం 22,722 మంది విద్యుత్ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించింది. వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత్ విద్యుత్ ను అందించేందుకు రూ. 11,500 కోట్లను డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు సబ్సిడీగా చెల్లిస్తున్నది.
తలసరి విద్యుత్ వినియోగం
తలసరి విద్యుత్తు వినియోగం సైతం ఒక ప్రధాన ప్రగతి సూచిక. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేది.2021-22 నాటికి అది2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటును గనుక పరిశీలిస్తే1,255 యూనిట్లుగా ఉన్నది. అంటే తెలంగాణతలసరి విద్యుత్తు వినియోగం, జాతీయ తలసరి వినియోగంకన్నా 69.40 శాతం ఎక్కువగా నమోదవడం మనకు గర్వకారణం.
భధ్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా గుర్తింపబడిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో ఒక్కోటి 270 మెగావాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లను విద్యుత్ శాఖ ప్రారంభించింది.
నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్ కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరిదశకు వచ్చాయి.ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంటు నుంచి కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

సోలార్, జల విద్యుత్తు ఉత్పత్తి
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిననాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల 01.05.2023 నాటికి రాష్ట్రంలో 5,865 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నది.
జలవిద్యుత్ ఉత్పత్తిలో 2021-22 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాని కంటే రికార్డు స్థాయిలో 5654.7 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తిని సాధించడం జరింగింది.
భూపాలపల్లిలో కేటీపీపీ విద్యుత్ ప్లాంట్
గడిచిన పదేండ్లలో TSGENCO ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (KTPP)లో 600 మెగావాట్లు, దిగువ జూరాల లో 240 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (స్టేజ్ 7) KTPS (VII) లో 800 మెగావాట్లు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో 1080 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభించబడ్డాయి. కేవలం 48 నెలల రికార్డు సమయంలో KTPS వద్ద 800 MW సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను 24 గంటలు అందిస్తూ, 2025 నాటికి అంచనా విద్యుత్ డిమాండ్ 18,223 మెగావాట్లకు చేరేలా ప్రభుత్వం లక్ష్యాలను ఏర్పరుచుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నది.

విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత:
*2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు కాగా దేశ తలసరి విద్యుత్ వినియోగం 1255 యూనిట్లు. దేశ తలసరి విద్యుత్ వినియోగం కంటే ఇది 69.40 శాతం ఎక్కువ.
*27.49 లక్షల మంది రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సౌకర్యం
*తెలంగాణ రాష్ట్ర స్థాపిత విద్యుత్ సామర్థ్యం 2014 లో 7,778 మెగావాట్లు కాగా, 1 మే 2023 నాటికి 18,567 మెగావాట్లు. 2014 తో పోల్చితే 2023 నాటికి రెండు రెట్ల కంటే ఎక్కువగా పెరిగింది.
*23.03.2014 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 13,162 మెగావాట్లు కాగా, స్వరాష్ట్రంలో 30.03.2023 న నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,497 మెగావాట్లు. 14.03.2023 న రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 297.89 మిలియన్ యూనిట్లు.
*2014 లో వ్యవసాయరంగ సేవల పరిధిలో ఉన్న విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య 19.03 లక్షలు కాగా 01.05.2023 నాటికి 27.49 లక్షలు.
రాష్ట్రంలోని మొత్తం విద్యుత్తు కనెక్షన్లు 2014 లో 1.11 కోట్లు కాగా 01.05.2023 నాటికి 1.78 కోట్లు