mt_logo

మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితోనే 1000 గురుకులాలు పెట్టాం: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి ఉత్సవాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సంఘం కోసం, సమాజం కోసం పని చేసి శాశ్వతమైన ఖ్యాతిని సాధించుకున్న గొప్ప మహా మనిషి జ్యోతిబా ఫూలే. 197 సంవత్సరాల క్రితం జన్మించిన ఫూలే గారు ఎంచుకున్న మార్గం ఆయన బోధనలు ఇప్పటికీ కూడా అందరికీ ఆచరణీయం అని పేర్కొన్నారు.

విద్యతోనే వికాసం వస్తుంది అని బలమైన నమ్మకంతో తన ఇంటి నుంచే మార్పు మొదలుపెట్టి ముందుకు సాగిన గొప్ప వ్యక్తి. తన సతీమణి సావిత్రిబాయికి పాఠాలు చెప్పి.. ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఇద్దరు కలిసి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు . సమాజంలోని అన్ని వర్గాలు జ్యోతిబా ఫూలే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి అని అన్నారు.

మనము ఏ కులం, ఏ మతంలో పుట్టాలి అన్న విషయం మన చేతిలో లేదు.. కానీ అవకాశాల కల్పన, ఉపాధి కల్పన అందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత ఇచ్చే అవకాశం సమాజానికి ప్రభుత్వానికి ఉన్నది.. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వివిధ రకాల సలహాలు, సూచనలు ఇస్తూ బాధ్యతను నిర్వహిస్తాం అని తెలిపారు.

75 సంవత్సరాల భారత స్వాతంత్ర చరిత్రలో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించిన ప్రభుత్వం గత పది సంవత్సరాల మా ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలుగుతాం.. విద్యతోనే వికాసం.. వికాసంతోనే సమానత్వం అన్న ఫూలే గారి ఆలోచనలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 1000 కి పైగా గురుకుల పాఠశాలలను పెట్టి విద్యను అందించాం అని కేటీఆర్ గుర్తు చేశారు.

ఒక్కో విద్యార్థి పైన రూ. 1,25,000 ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి విద్య అందించాం.. మహాత్మా జ్యోతిబా ఫూలే చెప్పిన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రతి పాఠశాలను ఇంటర్మీడియట్ కాలేజీకి అప్‌గ్రేడ్ చేశాము.. బీసీ విద్యార్థుల కోసం 33 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టాం అని అన్నారు.  

మహాత్మ జ్యోతిబా ఫూలే పేరుతో రూ. 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్‌ను అందించాం.. ఈ విషయంలో దళిత, గిరిజన, బహుజన, అగ్రవర్ణ పేదలు అన్న వివక్ష చూడలేదు. దేశమంతా స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు.. శతాబ్దాలుగా అందుబాటులో ఉన్న బహుజన వర్గాల నైపుణ్యం గురించి మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని అభివర్ణించారు.

అగ్గిపెట్టెలో పట్టిన చీర వేసే నేతన్న నైపుణ్యాన్ని తిరిగి గుర్తించాము.. బడుగు, బలహీనవర్గాలకు ఉన్న అద్భుతమైన నైపుణ్యాన్ని కాపాడి వాటికి భద్రత ఇచ్చి అనేక కార్యక్రమాలను బడుగు బలహీన వర్గాల కోసం చేపట్టాం. యాదవులు, ముదిరాజులు తమ వృత్తి నైపుణ్యం ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని తమ రంగాల్లో అగ్రగామిగా నిలిపారు. అదేవిధంగా ఒకప్పుడు ఊపిరి తీసుకునే నేతన్నలు ఈరోజు ఊపిరి పీల్చుకునే విధంగా తయారు చేశాం. గౌడన్నలకు కూడా అనేక మద్దతు అందించం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వర్గాల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాము అని అన్నారు.

దళిత బంధు, బీసీ బందు పెట్టినప్పుడు సమాజంలో ఇతర వర్గాల నుంచి కొంత ఇబ్బంది అవుతుందని హెచ్చరించిన.. రాజకీయంగా రిస్క్ తీసుకొని బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన దమ్మున్న నాయకుడు కేసీఆర్.. కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టి మహాత్మ ఫూలే బాటలో నడిచినారు. మేము విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో ఆచరణ ద్వారా మహాత్మ ఫూలే ఆలోచనలను ముందుకు తీసుకుపోయాం అని పేర్కొన్నారు.

అసెంబ్లీలో అత్యధికంగా బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ మాది.. ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల్లోనూ ఐదు రిజర్వేషన్ సీట్లు పోతే 12 సీట్లలో 50% సీట్లు కేటాయించిన పార్టీ బీఆర్ఎస్. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ తెలిపారు.

కేవలం ప్రభుత్వాధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ అవకాశాల కోసం కూడా పాటుపడుతున్న పార్టీ మాది. ఎన్నికల ముందు బీసీలను ఓటు బ్యాంకుగా చూసి.. వారి నుంచి ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. మహాత్మ ఫూలే పేరుతో 20 వేల కోట్ల రూపాయల బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు.. మొన్న వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదు అని విమర్శించారు. 

రానున్న బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించాలి. ఎంబీసీలకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు దాన్ని వెంటనే నిలుపుకోవాలి. బీసీలకు అంతర్జాతీయ స్థాయి గురుకులాలు పెడతామన్నారు.. మండలానికి ఒకటి వెంటనే ప్రారంభించాలి అని డిమాండ్ చేశారు.

రాబోయే మూడు సంవత్సరాలలో ద్విశతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మహాత్మ జ్యోతిబా ఫూలే సమున్నత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. మా నాయకురాలు కవిత గారు అసెంబ్లీలో జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.. బీసీల విషయంలో కేవలం మాటలకే పరిమితం కాకుండా.. మీరు ఇచ్చిన హామీలని ఆచరణలోకి రావాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు.