mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది.. సాగు, తాగు నీరు ఎందుకు ఇవ్వడం లేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల రైతులు ఎదుర్కొన్న నష్టాలపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాలు, వడగండ్ల వల్ల 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉత్తర తెలంగాణలో పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నది. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పంట నష్ట తీవ్రతపై అంచనా వెయ్యలేదు, కనీసం రైతులను పరామర్శించలేదు అని అన్నారు.

40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వం పంట నష్టంపై అంచనా వెయ్యలేదని మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మా హయంలో ఆకాల వర్షాలకు పంట నష్టం జరిగితే బోనకల్లు వెళ్లి పంట నష్టం అంచనా వేసి.. నష్టపోయిన రైతులకు కొత్త జీవో తెచ్చి 10,000 రూపాయలు ఎకరాకు ఇచ్చాం అని గుర్తు చేశారు.

ఆనాడు మార్చి 23 నుండి ఏప్రిల్ 23 వరకు పంట నష్టం జరిగితే మేమే స్వయంగా వెళ్లి పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఆనాడు మేము పంట నష్ట పోయిన రైతులకు డబ్బులు రిలీజ్ చేస్తే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసి.. రైతుల అకౌంట్స్‌లో డబ్బులు వెయ్యకుండా అడ్డుకున్నారు.. మీకు చిత్తశుద్ది ఉంటే ఏంటనే ఆ డబ్బులను రిలీజ్ చేసి రైతుల అకౌంట్స్‌లో వెయ్యాలి అని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

రైతుబంధు కింద కేసీఆర్ ప్రభుత్వం రూ. 7,500 కోట్లు రూపాయలు సిద్దం చేస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతుల అకౌంట్స్‌లో పడకుండా అడ్డుకున్నారు. ఇవ్వాళ ఆ డబ్బులు ఎవరు వాడుకున్నారో తెలుసు.. వాళ్ళు రాష్ట్ర మంత్రివర్గంలోనే ఉన్నారు. 16,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన డబ్బులు ఎక్కడకి పోయాయి, ఇంత వరకు రైతు బంధు అందరికీ పడలేదు అని ప్రశ్నించారు.

మంత్రి కాకున్నా, ఎమ్మెల్యే కాకున్నా తుమ్మల నాగేశ్వరరావుని కేసీఆర్ గారు హెలికాప్టర్‌లో ఎక్కించుకొని బోనకల్లు తీసుకోని వెళ్ళింది నిజమా కాదా? తుమ్మల నాగేశ్వరరావే చెప్పాలి.. అపర భగీరథుడనీ కేసీఆర్‌ను పొగిడింది నిజం కాదా… 56 లక్షలకు పైగా ఎకరాలకు నీరు ఇచ్చి పంటలు పండించిన ఘనత కేసీఆర్ గారిది.. రైతులను ముంచకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చెయ్యాలి అని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో డిసెంబర్ 9 న రుణమాఫి చేస్తామని హామీ ఇచ్చారు.. చిత్తశుద్ది ఉంటే ఏంటనే రూ. 2 లక్షల రుణమాఫి చెయ్యాలి. కేసీఆర్ హయంలో రైతులు అత్యధికంగా వరి పండించారు. కేసీఆర్ హయాంలో రైతులు మిర్చి అత్యధికంగా పండించారు.. పత్తి విషయంలోనూ మూడో స్థానానికి చేరుకున్నాం అని రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

ఇవ్వాళ రైతుల ఆత్మహత్యలు మొదలు అయినాయి, దొంగ కరెంట్ ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారు. మా హయంలో ఎండాకాలంలో సాగు నీళ్ళు ఇచ్చాం, సమ్మక్క బ్యారేజ్ దగ్గర నీళ్ళను ఎందుకు ఎత్తడం లేదు. మా హయంలో మంచినీళ్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇచ్చాం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది.. ఎందుకు సాగు నీరు, తాగు నీరు ఇవ్వడం లేదు అని విమర్శించారు.

ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళడం శోచనీయం.. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి వెళ్తున్న నేతలను ప్రజలే ఛీ కొడుతరు, చెప్పులతో కొడుతరు. అక్రమాలు చేయడానికే కొందరు అధికార పార్టీలోకి వెళ్తున్నారు.. వారి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీయే బయట పెడుతుంది అని హెచ్చరించారు.