mt_logo

రేవంత్ రెడ్డిని సంఘం నుంచి బహిష్కరించాలి: కాంగ్రెస్ అధిష్టానానికి డా. దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

  • రేవంత్‌రెడ్డి ఓ దుష్టుడు, చరిత్రహీనుడు – శ్రవణ్
  • బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డి ని సంఘం నుండి బహిష్కరించాలి 
  • అమాయక ప్రజలను చట్ట వ్యతిరేకంగా అవమానించే రేవంతు పార్లమెంట్ సభ్యత్వం ఎందుకు రద్దు చెయ్యొద్దు

హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానానికి డా దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాసారు.  తెలంగాణ ప్రజలను అవమానించడం, బాధపెట్టడం, బెదిరించడం, నీచంగా మాట్లాడమని , కించపరిచే పదజాలంతో బాధపెట్టమని TPCC అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ & కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైనా ప్రత్యేక లైసెన్స్ ఇచ్చారా..? ఒకవైపు మహిళా విభాగం కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్ మహిళ అపర్ణా రెడ్డిని నియమించినట్లు ఏఐసీసీ చెబుతోంది.  అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాత్రం తెలంగాణకు చెందిన ట్రాన్స్‌జెండర్లను తన రాజకీయ చర్చల్లోకి లాగి దుర్భాషలాడుతున్నాడు. 

యాదవులను పేడ పిసుకుంటారని కించపర్చడం,  దొమ్మర్లను, వంశరాజులను హేళన చేయడం..మిగతా కులాలను చులకన చేయడం రేవంత్ కు అలవాటుగా మారింది. గొల్ల కురుమలు, బీసీలను, ఎస్సీలను, ఎస్టీ లను ఇలా ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇలాంటి బాధ్యతారహితమైన రాజకీయ నాయకుడ్ని సంఘం నుండి బహిష్కరించాలి. రేవంత్‌రెడ్డి తన అగ్రకుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారని యావత్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అగ్ర కులస్థుడనే పొగరుతో బీసీ కులస్థులను అవమానపరుస్తున్నాడు. రేవంత్‌రెడ్డి ఓ దుష్టుడు, చరిత్రహీనుడు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 21, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 504, అలాగే లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టంలోని సెక్షన్ 18 డి 2109 ని రేవంత్ రెడ్డి ఉల్లంగిస్తున్నాడు. పేదలను తూలనాడే ఈ అగ్రకుల ఆధిపత్య అహంకారం ఎందుకు? తన ఇటీవల అమెరికా పర్యటనలో, 3 ఎకరాల భూమి ఉన్న పేద రైతులకు 3 గంటల కంటే ఎక్కువ కరెంటు ఇచ్చే అవసరం లేదని ఆయన అర్ధం పర్ధం లేకుండా మాట్లాడినారు. అయితే ఆయన మూర్ఖపు, అవమానకరమైన వ్యాఖ్యలతో తెలంగాణ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా, అతని మూర్ఖత్వం మరియు మతిస్థిమితం లేని ప్రవర్తనను ఖండించారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, 24 గంటల విద్యుత్ గురించి అందులో అవినీతి అంటూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లడానికి రేవంత్ తప్పుడు కథనాన్ని ప్రారంభించాడు. 

అబద్దాలతో ప్రజల మనసు గెలవలేము అనే విషయం మూర్ఖుడైన రేవంత్ అర్ధం చేసుకోలేక పోతున్నాడు.  ట్రాన్స్‌జెండర్ల వర్గాన్ని, వివిధ  బీసీలను అవమానించేలా రేవంత్ మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు కూడా చాలాసార్లు ఇలాగే మాట్లాడాడు.  AICC అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే , సీనియర్ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ మరియు శ్రీమతి ప్రియాంక గాంధీ లు ఎందుకు..రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే సహిస్తున్నారు..?

రాజకీయ సంస్కృతిని నాశనం చేసే రాబందుగా రేవంత్ రెడ్డి మారిన విషయాన్ని ఏఐసీసీ ఎందుకు గుర్తించడం లేదు? ఎందుకు నియంత్రించడం లేదు? చిల్లర రాజకీయాల కోసం ప్రతిపక్షాలను, పేద ప్రజలను  హీనమైన పదజాలంతో దుర్భాషలాడడం, అందరినీ కించపరచడం భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కొత్త ఆచారమా..?  సీఎం కేసీఆర్ పాలనలో సమాజంలోని ప్రతి వర్గం ఎంతో గౌరవంగా ఉంది. ఎలాంటి కులం , మతం, లింగం విభేదాలు , వివక్షత లేకుండా కేసీఆర్ గారు గౌరవిస్తున్నారు. అన్ని కులాల వారిని మతాలవారిని ప్రోత్సహిస్తూ..వారి అభివృద్ధికి చేయూత ఇస్తున్నాడు. ఇది చూసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేర్చుకోవాలి. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో ప్రాచీ రాథోడ్ మరియు రూత్ జాన్ పాల్ కొయ్యాల వైద్యులుగా నియమించి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని  గౌరవించారని దయచేసి గమనించండి. అదే సమయంలో మీ టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి, మీ పార్టీ చిల్లర రాజకీయాల కోసం ట్రాన్సజెండర్ సమాజాన్ని మరియు దొమ్మర, వంశ రాజులు, యాదవులు, గౌడలు మొదలైన వారితో సహా సమాజంలోని ఇతర పేద వర్గాలను అవమానిస్తూ తక్కువ స్థాయికి దిగజార్చుతున్నాడు. రేవంత్ నోటికి అడ్డు అదుపులేదు. అవతలి వ్యక్తులను, వారి వయసును, వారి కులాలను ఏమాత్రం లెక్కచేయకుండా అవమానిస్తున్నాడు. 

ఆయనకు ఓ మర్యాద, సభ్యత , సంస్కారం లేదు. ఇలాంటి వ్యక్తి తెలంగాణ రాజకీయాలకు అవమానకరం. పార్టీని దుర్వినియోగం చేయడమే కాకుండా, డబ్బులు వసూలు చేస్తూ, తన అనుచరుల చేత ఇతర పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలను మొదలైనవారిని బెదిరిస్తున్నాడు. రేవంత్ ఓ మానసిక రోగి.. అతడిని క్వారంటైన్‌లో ఉంచాలి.

నేర చరిత్ర ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించి భారత జాతీయ కాంగ్రెస్ తప్పు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భావిస్తే.  రేవంత్ ఆకతాయి ప్రవర్తనను కాంగ్రెస్ పార్టీ ఆమోదించకపోతే., ఏ రాజకీయ పార్టీకి నాయకుడిగా ఉండే కనీస అర్హత లేని శ్రీ రేవంత్ రెడ్డిని వెంటనే అధ్యక్ష పదవినుండి  తొలగించి, ట్రాన్స్‌జెండర్లు, వెనుకబడిన తరగతులు మరియు ఇతర వర్గాలకు బేషరతుగా క్షమాపణలు చెప్పే విధంగా చర్యలు చేపట్టాలి. 

రేవంత్ తన రాజకీయ ప్రసంగాలలో తోటి మనుష్యులు అనే కనీస ఇంగితం లేకుండా, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని, బీసీ కులాలను కించపరిచి, అవమానించేలా మాట్లాడినందుకు చట్ట ప్రకారం తగిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నేను తగిన పోలీసు అధికారులకు మరియు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు , తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ లకు జాతీయ మానవ హక్కుల సంఘానికి, జాతీయ ఓబీసీ కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నాను. బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డి వంటి రాజకీయ నాయకుడ్ని సంఘం నుండి బహిష్కరించాలి అని కోరుతున్నాను. అదేవిధంగా అమాయక ప్రజలను పేదలను చట్ట వ్యతిరేకంగా అవమానిస్తూ, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్న  రేవంత్ పార్లమెంట్ సభ్యత్వం కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి చేసారు.