
- నిర్మల్ జిల్లా మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ ఆమోదం
- 100 మెడికల్ సీట్ల ప్రవేశానికి అనుమతి
- 2023-2024 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం
- అనుమతులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం
సీఎం కేసీఆర్ సారధ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృషితో నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరనుంది. నిర్మల్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ త్వరలో ప్రారంభం కానున్నది. మెడికల్ కాలేజీ ప్రారంభానికి అవసరమైన ప్రాథమిక అనుమతులను నేషనల్ మెడికల్ కౌన్సిల్, మెడికల్ అసెస్మెంట్ & రేటింగ్ బోర్డ్ మంజూరు చేసింది.ఈ మేరకు 100 మెడికల్ సీట్ల ప్రవేశానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రాథమిక అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాలేజ్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు, ప్రత్యేక చొరవ చూపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
2023- 2024 నుంచి మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. నిర్మల్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజల కోరిక మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరుకు కృషి చేసి దాన్ని సాధించారు. జిల్లా కేంద్రం నిర్మల్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఉత్తర్వులు జారీ చేయటంతో పాటు నిధులు కేటాయించింది. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. దీంతో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.