mt_logo

నాడు మాట ఇచ్చాం, నేడు నిలబెట్టుకుంటున్నాం: మంత్రి సింగిరెడ్డి

నాడు మాట ఇచ్చాం, నేడు నిలబెట్టుకుంటున్నాం.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుంది అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాల బ్యాక్ వాటర్ నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అనే వాదన హాస్యాస్పదం అని జూరాల రిజర్వాయర్ సామర్ద్యం 9 టీఎంసీలు.. అందుబాటులో ఉండేది 6 టీఎంసీలేనని.. 6 టీఎంసీల నీళ్లుండే జూరాల నుండి 70 టీఎంసీల పాలమూరు రంగారెడ్డికి నీళ్లు ఎత్తిపోయడం సాధ్యమయ్యేపనేనా అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పెట్టించడం, పాలమూరు ప్రజలను మోసంచేయడం లక్ష్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హడావిడిగా దానిని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో 263 టీఎంసీల సామర్థ్యం గల శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రాంతం నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు తీసుకుంటున్నారు అని పేర్కొన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాతనే జూరాల ఆయకట్టు కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు సాగునీరు అందింది. దశాబ్దాల పాటు జూరాలను నిర్మించిన వారు, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలను సాగదీసి పాలమూరును ఎండబెట్టి ప్రజలను వలసలపాలు చేసిన వారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడే హక్కు లేదు అని అన్నారు.

పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి, పట్టుదలకు నిదర్శనం. ఇచ్చిన మాట ప్రకారం పాలమూరు రంగారెడ్డి అందుబాటులోకి వస్తున్నది అని ప్రాజెక్టు పూర్తికాకుండా కేసులు వేసి అడ్డుకున్న వారే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పూర్తవుతుండడాన్ని చూసి కన్నీళ్లు కారుస్తున్నారు అని అభిప్రాయపడ్డారు. 

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో భవిష్యత్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా దేశంలోని అగ్రగామి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా నిలుస్తుందని పాలమూరు ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు అని మంత్రి అన్నారు.

ఈ నెల 16న నార్లాపూర్ పంప్ హౌస్ వెట్ రన్, కొల్లాపూర్ ముఖ్యమంత్రి బహిరంగసభకు పాలమూరు ప్రతి పల్లె నుండి కదిలిరావాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.