ప్రధాని నరేంద్ర మోడీ గారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…??? అని ప్రశ్నిస్తూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు?, మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు?, మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?, మూడు రోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు.. మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది ? అని అడిగారు. పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ??, మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. ?? అనడిగారు. గుండెల్లో గుజరాత్ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ?? అని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఊపిరి తీశారు. లక్షల ఉద్యోగాలిచ్చే ఐ.టీ.ఐ.ఆర్ ను ఆగం చేశారు, మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు, దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహం చేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు.
మీ పదేళ్ల పాలనలో.. 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు..140 కోట్ల భారతీయులను మోసం చేశారని తెలిపారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు, దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు, పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అన్నారు? మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప, దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా..? అనడిగారు. మీ పసుపు బోర్డు ప్రకటన కూడా.. మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉందన్నారు. ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో.. అన్నారు. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో…అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటని అడిగారు. మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా…! అన్నారు. మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ…!! అని పేర్కొన్నారు.