కాంగ్రెస్ బస్సుయాత్ర… తుస్సుమనడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని తెలిపారు. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక, గత పదేళ్ల కాలంలో, గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని అడిగారు.
విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వంద రోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీదని దుయ్యబట్టారు. మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాదని స్పష్టం చేశారు. కర్ణాటకలో రైతులకు ఐదు గంటల కరెంటు కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరని మండి పడ్డారు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాదని తెలిపారు.
నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి, తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరని అడిగారు. కరప్షన్కు కేరాఫ్… కాంగ్రెస్ అని చెప్పారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు, ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ?? అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా పోడు భూముల సమస్యను, కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరని పేర్కొన్నారు. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి, అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదన్నారు.
తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే, వందల మంది బలిదానాలకు కారణమని స్పష్టం చేశారు. నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్ అని తేల్చి చెప్పారు. గాంధీభవన్ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీప్, టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు… రేవంతు..రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది.. ?? అని అడిగారు.
రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్.. మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉందన్నారు. మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది. మూడు రోజుల పర్యటన చేసినా.. మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా… తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మరని స్పష్టం చేసారు. వైఫల్యాల కాంగ్రెస్ను ఎప్పటికీ విశ్వసించరని ధీమా వ్యక్తం చేసారు.