mt_logo

వర్షాకాలం నేపథ్యంలో పట్టణాలలో తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి కేటీఆర్ సమీక్ష

  • పట్టణాల్లో వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కోనేందుకు సంసిద్ధంగా ఉండాలి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్
  • వర్షాకాలం నేపథ్యంలో పట్టణాల్లోలో తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి కేటీఆర్ సమీక్ష
  • ఇందులో భాగంగా పురపాలికల్లో చేపట్టిన వర్షాకాల సన్నద్ధత కార్యక్రమాలను సమీక్షించిన కేటీఆర్

రాష్ట్రంలోని పట్టణాల్లో ఆయా పురపాలికలు చేపట్టిన వర్షాకాల సన్నద్ధత (Monsoon preparedness) ప్రణాళికలపైన పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఈరోజు పురపాలక శాఖలోని వివిధ విభాగాల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలికల తో పాటు హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అధికారుల  ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని మంత్రి సూచించారు. ఇప్పటికే వర్షాకాల ప్రణాళికకు సంబంధించి గత కొంతకాలంగా పురపాలికలు అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రి  కేటీఆర్ కి తెలిపారు. ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు మరియు రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో నాలాల సేఫ్టీ ఆడిట్ ని పూర్తి చేసినట్లు తెలిపారు.

డీ వాటరింగ్ పంపుల ఏర్పాటు 

ఈ సమావేశంలో హైదరాబాద్ నగరంలో వర్షాకాల సన్నద్ధతపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్, వర్షాల నేపథ్యంలో నగరంలో ఎదురయ్యే వరదలు, భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ ఎన్ డీ పి ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేపట్టిన పనుల్లో మెజార్టీ పనులు పూర్తయ్యాయని,  గత సంవత్సరంతో పోలిస్తే వరద ప్రమాదం అనేక కాలనీలకు తప్పుతుందని ఎస్ ఎన్ డీ పి విభాగం అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అవసరమైన డీ వాటరింగ్ పంపులు, ఇతర ఏర్పాట్లను చేసుకుని సన్నద్దంగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా ఉన్న చెరువులలో నీరు, ఫుల్ ట్యాంకు నిల్వలకు చేరకుండా వాటి నీటి నిల్వ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని  సూచించారు.   

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందం ఏర్పాటు

నగరవ్యాప్తంగా ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరుపై మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉన్నదని, ఈ దశలో ఎదురయ్యే సవాళ్ళను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారులకు సూచించారు. ఈ దిశగా జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రతిరోజు వార్డు కార్యాలయ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కోరారు. వార్డు కార్యాలయ వ్యవస్థను నగర పౌరులు విస్తృతంగా వినియోగించుకునేలా ప్రయత్నాలు చేయాలన్నారు. వార్డు కార్యాలయ వ్యవస్థ మరింతగా మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకునేలా ప్రత్యేకంగా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వార్డు కార్యాలయ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అన్ని విభాగాల అధికారులు రానున్న కొన్ని వారాలపాటు ప్రత్యేకంగా అంతర్గత సమీక్షలు నిర్వహించుకొని, వార్డు కార్యాలయ వ్యవస్థ పనితీరును బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. 

మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆరా..  

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలువురు నగర పౌరులతో ఫోన్లో మాట్లాడారు. జీహెచ్ఎంసీ కి వివిధ సమస్యలపైన ఫిర్యాదు చేసిన వారికి, ఆయా సమస్యల పరిష్కారం జరిగిన తీరు, ఈ విషయంలో జీహెచ్ఎంసీ నుంచి ఎదురైన అనుభవాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాల విషయంలో జీహెచ్ఎంసీ కి ఫిర్యాదు చేసిన తర్వాత, ఆ సమస్యను పరిష్కరించి, అందుకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ ని  కూడా తీసుకున్నట్లు గాజుల రామారావుకి చెందిన రామ్ మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆరా చేసిన తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి దన్యవాదాలు తెలిపారు.