mt_logo

నేడు దుర్గంచెరువు ఎస్టీపీని ప్రారంభించనున్న కేటీఆర్.. 100% మురుగునీటిని శుద్ధి చేసే దిశగా హైదరాబాద్ అడుగులు

  • సెప్టెంబర్ 25న దుర్గంచెరువు ఎస్టీపీని ప్రారంభించనున్న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్
  • ఏర్పాట్లు పూర్తి చేసిన జలమండలి అధికారులు
  • సీఎం కేసీఆర్ నాయకత్వంలో విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్ రూ.3866 కోట్లతో కొత్తగా 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న జలమండలి
  • త్వరలో 100% మురుగునీటి శుద్ధి వసతి కలిగిన నగరంగా హైదరాబాద్

జలమండలి నిర్మిస్తున్న దుర్గంచెరువు మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు సోమవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు జలమండలి అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం కేసీఆర్ తన ముందుచూపుతో అనేక సంస్కరణలు చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి మంచి పర్యాటక కేంద్రంగా నిలిచింది. అక్కడ ఏర్పాటు చేసిన పార్క్ సైతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఆ చెరువు పరిరక్షణకు సైతం ప్రభుత్వం నడుంకట్టింది.

చెరువులో మురుగు నీరు చేరి కలుషితం కాకుండా.. జలమండలి ఆధ్వర్యంలో అక్కడ మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని సైతం నిర్మించారు. దీని వల్ల చెరువు కాలుష్య రహితంగా ఉంటుంది. 7 ఎంఎల్‌డీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీ.. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్ రన్ ప్రక్రియ సైతం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్ మహానగరంలో రోజూ ఉత్పన్నమయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎస్టీపీల ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు ప్యాకేజీల్లో మొత్తం 31 కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నారు.

హైదరాబాద్ మహానగరంలో మురుగు నీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. నగరంలో రోజూ ఉత్పన్నమయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయడానికి సంకల్పించింది. దీని కోసం రూ.3866.41 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్‌డీల సామర్థ్యం గల కొత్తగా 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మించ తలపెట్టింది. వీటి నిర్మాణ బాధ్యతను జలమండలిపై పెట్టింది. కాగా వీటిని మొత్తం 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. వీటి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే.. రోజూ ఉత్పన్నమయ్యే మురుగును 100% శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుంది.

ప్యాకేజీల పరంగా వివరాలు:
1) ప్యాకేజీ-I లో అల్వాల్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.

2) ప్యాకేజీ-II లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో రూ.1355.13 కోట్లతో 6 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 480.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.

3) ప్యాకేజీ-III లో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి, ఇక్కడ 376.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు.

వంద శాతం మురుగు శుద్ధి లక్ష్యంగా..
హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇది జీహెచ్ఎంసీ ప్రాంతంలో 1650 ఎంఎల్డీలుగా ఉంది. ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని (46%) శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అధికం. మిగిలిన 878 ఎంఎల్డీల మురుగు నీటిని శుభ్రం చేయడానికి రూ.3866.41 కోట్ల వ్యయంతో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. 2036 సంవత్సరం వరకు రాబోయే కాలంలో ఉత్పన్నమయ్యే మురుగును వీటి ద్వారా శుద్ధి చేస్తారు.

వాసన కట్టడికి చర్యలు:
నివాసాల సమీపంలో నిర్మిస్తున్న ఎస్టీపీల నుంచి దుర్వాసన రాకుండా జలమండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దీనికోసం ఆధునిక విదేశీ సాంకేతికతను అధికారులు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా.. విశాలమైన ఎస్టీపీల ప్రాంగణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడుతున్నారు. వీటితో పాటు మొత్తం 22 ఎస్టీపీల ప్రాంగణాల్లో సుగంధ ద్రవ్యాల జాతికి చెందిన ఆకాశమల్లి, మిల్లింగ్, టోనియా, మైకేలియా చంపాక, (సింహాచలం సంపంగి) మొక్కల్ని నాటారు. ఇవి దుర్వాసనను అరికట్టి సువాసనను వెదజల్లుతాయి. కాగా.. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మొదటి కోకాపెట్ ఎస్టీపీ ని మంత్రి కేటీఆర్ ఈ ఏడాది జూలై 1న ప్రారంభించారు.