mt_logo

జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ని ఏర్పాటు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్

  • 15వ తేదీన ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ప్రారంభం
  • ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్
  • 15వ తేదీన జరిగే మెడికల్ కాలేజీ ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు
  • 20,000 మందికి తగ్గకుండా ర్యాలీ నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచన

15న జరిగే మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు మంత్రి కేటీఆర్. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది.  ఈ దశ ఈనెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభం చేసి చరిత్ర సృష్టించనున్నదన్నారు.  జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదన్నారు.  రాష్ట్రంలోని జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో నూతన మెడికల్ కాలేజీలను ఈనెల 15వ తేదీన ప్రారంభించుకోబోతున్నాం.. మెడికల్ కాలేజీలు ప్రారంభించుకుంటున్న 9 జిల్లా కేంద్రాల్లో కనీసం 15 నుంచి 20 వేల మందికి తగ్గకుండా భారీ ర్యాలీలను చేపట్టాలన్నారు. 

స్వయంగా ముఖ్యమంత్రి ఒక మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కామారెడ్డి లో పాల్గొననున్నారు.  ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా ఆ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకు, జిల్లా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఆయా జిల్లాల పరిధిలో ఉన్న శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు 15వ తేదీన జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. మెడికల్ కాలేజీ ప్రారంభం వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లో రిజిస్టర్ అయ్యే విధంగా ఈ కార్యక్రమంలో భారీగా పెద్ద ఎత్తున యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు.  మెడికల్ కాలేజీ ఏర్పాటు వలన కేవలం విద్యార్థులకే ప్రయోజనం కాకుండా దానికి అనుబంధంగా ఉండే హాస్పిటల్ వలన ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయి. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలన్నారు. రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని పేర్కొన్నారు.