mt_logo

అవినీతి సొమ్మును తెలంగాణకు బదిలీ చేసే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిన కాంగ్రెస్

అవినీతి సొమ్మును తెలంగాణకు బదిలీ చేసే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిన కాంగ్రెస్ అని తెలిపారు మంత్రి హరీశ్ రావు.  మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మంత్రి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు..  బెంగళూరు నగరంలో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్మును తెలంగాణకు బదిలీ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని మండి పడ్డారు. ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు.  కర్ణాటకలో 40 శాతం కమిషన్ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు 50 శాతం కమిషన్ ప్రభుత్వం ఉంది.

ఐటీ దాడుల్లో రూ. 42 కోట్ల నగదు 

కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అంబికాపతి ఆ రోజుల్లో 40 శాతం కమిషన్ పని చేసేవారు. నేడు అదే అంబికా పతి 50% కమిషన్ వసూలు చేసి తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తున్నారని తెలిపారు. అంబికాపతి సతీమణి అశ్వత్తమ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. ఇద్దరు ఇంట్లో వుండగానే ఐటి దాడులు జరిగాయి. ఐటీ దాడుల్లో రూ. 42 కోట్ల నగదు దొరికాయి. తెలంగాణకు తరలించేందుకు కాంట్రాక్టర్‌లనుంచి వసూలు చేసిన డబ్బు ఇది అని తెలుస్తుందన్నారు.కాంగ్రెస్ దీనిపై సమాధానం చెప్పాలి. అంబికాపతి గారు డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడు అని, ఈశ్వరప్ప గారికి కూడా సన్నిహితుడు అని తెలుస్తున్నదని పేర్కొన్నారు.

చెన్నై ద్వారా హైదరాబాద్ పంపాలని ప్లాన్

తెలంగాణ టాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి, పంపే కుట్ర చేస్తున్నారని అన్నారు. కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు బిల్డర్ల దగ్గర నుంచి, వ్యాపారుల నుంచి, కాంట్రాక్టర్ దగ్గర నుండి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయాలని, ఈ అక్రమ వసూళ్లకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. బెంగళూరు నుండి వయా చెన్నై ద్వారా హైదరాబాద్ పంపాలని ప్లాన్. ఇందులో కొందరు బిల్డర్లు, కాంట్రాక్టర్లు పాత్ర ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇలాంటి రాజకీయాలతో మీకు సంబంధం లేదు. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. కర్ణాటక అక్రమ సొమ్మును తెలంగాణకు తరలించే ప్రయత్నం ఎవరైతే చేస్తారో భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించారు. 

ఎస్ఎఫ్‌టీకి 75 రూపాయల పన్నును కాంగ్రెస్ వసూలు

తెలంగాణలో దొడ్డి దారిన గెలిచే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను నిర్ణయించుకోలేని పరిస్థితి. టికెట్లు తెచ్చుకోలేని పార్టీ.సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు. పక్కా పార్టీల దిక్కు చూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. షెడ్యూల్ వచ్చినా టికెట్లు డిక్లేర్ చేసుకోలేని దుస్థితని తెలిపారు. సగం సీట్లలో అభ్యర్థులు కరువైన పార్టీ కాంగ్రెస్. అభ్యర్థులు లేని కాంగ్రెస్, డబ్బులతో గెలిచే ప్రయత్నం చేస్తుందన్నారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారం చేస్తున్నది తప్ప ప్రజల్లో ఆదరణ లేదన్నారు.  కర్ణాటకలో ప్రతి ఎస్ఎఫ్‌టీకి 75 రూపాయల పన్నును కాంగ్రెస్ నాయకులు వసూలు చేస్తున్నారు. అప్పుడు ఆ నిర్మాణానికి అనుమతి ఇస్తారని తెలిపారు. 

కాంగ్రెస్ కాదు స్కాంగ్రేస్

కర్ణాటక అవినీతి మయం అయ్యింది. ఇక్కడ ఖర్చు చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ కాదు స్కాంగ్రేస్ అన్నారు. లీడర్లు పంచుకుంటారు కానీ ప్రజలకు పంచరు,  కాంగ్రెస్ నీతి ఏమిటి అనేది భయట పడింది.తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ డబ్బుకు ప్రాధాన్యం తప్ప, ప్రజల గురించి ఆలోచన లేదన్నారు. అప్లికేషన్లకు, టికెట్లు ఇచ్చేందుకు డబ్బులు, ఇప్పుడు అక్రమ డబ్బు తరలింపు, తెలంగాణ సమాజం ఎన్నటికీ సహించదన్నారు. మీకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.