mt_logo

కేసీఆర్ జనాలకు కిట్లు ఇస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ తిట్లు ఇస్తున్నాయి: మంత్రి హరీష్ రావు

నేడు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలోని 9 నియోజకవర్గాలు కుత్బుల్లాపూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలో నేడు ఇండ్ల పంపిణీ జరుగుతుందన్నారు.

అందుకే ఆడవారి పేరుపై ఇండ్లు
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరులో 4800 మంది లబ్దిదారులకు.. నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున కేటాయింపు చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుంది. ఎవరికి ఏ బ్లాక్ లో ఇల్లు వచ్చిందనేది కంప్యూటర్ ద్వారా కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేసారు. కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఇచ్చే ఇళ్లకు రూ.60 వేలు లంచాలు అడిగేవారు. ఇళ్ళ కాగితాలు కూడా బ్యాంకులో జప్తు పెట్టేటోళ్ళని గుర్తు చేసారు. కేసీఆర్ సర్కార్‌లో ఆ మాటే లేదని అన్నారు. అందుకే కేసీఆర్ ఆడవారి పేరుపై ఇండ్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జనాలకు కిట్లు ఇస్తుంటే… కాంగ్రెస్, బీజేపీ తిట్లు ఇస్తున్నారని అన్నారు.

కొల్లూరులో 150 ఎకరాల్లో 16700 ఇండ్లు
60 యేండ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పనులు 10 ఏళ్ళలో బీఆర్ఎస్ సర్కారు చేసింది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల, బస్తీ దవాఖాన, రేషన్ షాప్ ఏర్పాటు చేస్తామన్నారు. రజినీకాంత్ హైదరాబాద్ వచ్చి… అమెరికాలో ఉన్నానా అన్నారు. రజినికి అర్థమైన అభివృద్ధి.. ఇక్కడున్న కాంగ్రెస్, బీజేపీ గజినీలకు అర్థమైతలేదన్నారు. ప్రజలే బీఆర్ఎస్ హైకమాండ్, ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలి.. కేసీఆర్ ఏం అభివృద్ధి చేసాడో మీరే మీ గల్లీలో చెప్పాలని సూచించారు.

హైదరాబాద్‌లో 1 లక్ష ఇండ్లు ఇస్తున్నాం
150 ఎకరాల్లో 16700 ఇండ్లు కొల్లూరులో ఇస్తున్నామని తెలిపారు. సుప్రీం కోర్టులో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పై వేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ ఓడింది. తెలంగాణ ప్రభుత్వం గెలించిందని పేర్కొన్నారు.

దొంగ డిక్లరేషన్ చేసిన వారికి బుద్ధి చెప్పాలి
ఆలస్యం కావచ్చు కానీ న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. పాలమూరు ఎత్తిపోతల పథకంపై అక్రమంగా ఏపీ వేసిన కేసు కొట్టుకు పోయింది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. 90 టీఎంసీ (TMC) నీళ్లు కృష్ణా నదీ జలాల్లో మనకు వాటా దక్కుతుంది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి తెచ్చుకుంటాం. కృష్ణా నది జలాలను బాజాప్తా ఎత్తిపోసుకొని పాలమూరు రిజర్వాయర్లు నింపుకుంటామన్నారు. దొంగ డిక్లరేషన్ చేసిన వారికి బుద్ధి చెప్పేలా మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయాలన్నారు.