mt_logo

కనీసం టికెట్లు ఇచ్చుకునే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు: మంత్రి హరీష్ రావు

ఎన్నికల శంఖారావం మోగిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 15న హుస్నాబాద్‌లో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో ప్రణాళిక  సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబు తో కలిసి సభా ప్రాంగణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సభ పెట్టడం అంటే హుస్నాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ, నమ్మకం అన్నారు. గత ఎన్నికల్లో మొదటి సభ నిర్వహించారని గుర్తు చేశారు. అదేవిధంగా ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. 

టికెట్లు ఇచ్చుకునే పరిస్థితిలో లేదు కాంగ్రెస్

హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మి కటాక్ష  నియోజకవర్గం. మంచి జరగుతుంది అని ఇక్కడ నిర్వహిస్తున్నారని అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో సబ్‌స్టేషన్ వెనకాల ఉన్న ప్రదేశంలో సభ నిర్ణయించారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు గూగుల్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు. కనీసం టికెట్లు ఇచ్చుకునే పరిస్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు.  కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీలో ఎక్కువ గల్లీలో తక్కువ వయా బెంగళూరు, మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలకు, మతకల్లోలాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటున్నారని హెచ్చరించారు. 

ప్రతిపక్షాలు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటై 

అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు హుస్నాబాద్‌లో జరిగాయని తెలిపారు. 8 టీఎంసీలతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నం అని గుర్తు చేశారు. నీళ్లు వస్తే ప్రతి ఒక్కరికి సంతోషం ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటై అని మండిపడ్డారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ బాబు ఉండటం మీ అందరి అదృష్టమని అన్నారు. 15వ తేదీ మేనిఫెస్టో విడుదల తర్వాత నిర్వహించే మొదటి సభ హుస్నాబాద్‌లో జరుగుతుంది. కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2014, 18 లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. 

బీఆర్ఎస్ పార్టీని మోసం చేసింది కాంగ్రెస్

ఏవయితే చెప్తారో దానిని పక్కా చేసి చూపిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. పొత్తు పెట్టుకున్న పార్టీని పొట్టన పెట్టుకుందామని చూసింది  కాంగ్రెస్ పార్టీ. 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్న బీఆర్ఎస్ పార్టీని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని పెట్టి ఎంతో మంది తెలంగాణ ప్రజల చావుకి కారణం అయింది కాంగ్రెస్ పార్టీ. మూడు గంటలు కరెంటు రైతులకు సరిపోతుంది అన్న కాంగ్రెస్ కావాలా రైతుల మోటర్లకు మీటర్లు పెడుతున్న బీజేపీ కావాల్నా, మూడు పంటలకు సరిపడా కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా? అని అడిగారు.  హుస్నాబాద్ నియోజకవర్గం ఎందుకు బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందిందో ఆలోచించండని అన్నారు. 

మూడోసారి కేసీఆర్ విజయం పక్కా.. 

కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభివృద్ధి  చేయలేదన్నారు. ముఠా రాజకీయాలతో ఢిల్లీలో టికెట్ల పంచాయితీ నడుస్తుంది, బీఆర్ఎస్ టికెట్ ప్రకటించి 50 రోజులైనా ఇప్పటికీ టికెట్లు ప్రకటించుకోని కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఒకటి కాదు అనేక పథకాలకు దేశానికి ఆదర్శంగా నిలిచింది.కేంద్రమే మన పథకాలు కాపీ కొట్టింది అంటే మనం ఆదర్షమా కాదా? అని ప్రశ్నించారు. మూడోసారి కేసీఆర్ విజయం పక్కా. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సభ విజయవంతం చేయాలని కోరారు. మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. పండుగ వాతావరణంలో ఈ సభను విజయవంతం చేసి కేసీఆర్‌ను ఘనంగా స్వాగతం పలకాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఈ సభకు వస్తారు అందరినీ ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళికతో జాగ్రత్తగా ప్రజలకు ఇబ్బంది లేకుండా సభా స్థలానికి చేరుకునే విధంగా స్థానిక నాయకులు చూడాలని పేర్కొన్నారు.