mt_logo

డబ్బు సంచులతో వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటుంది: కంఠారెడ్డి తిరుపతి రెడ్డి

భారత రాష్ట్ర సమితి పార్టీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సమక్షంలో మెదక్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి చేరారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని మెదక్ జిల్లాలో బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేశానని అన్నారు. ఆ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పి పార్టీ మోసం చేసిందని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమైన నాయకులకు కాకుండా డబ్బు సంచులతో వచ్చిన పారాషూట్ లీడర్లకు మాత్రమే టికెట్లు ఇస్తుందన్నారు. డబ్బు సంచులతో వచ్చిన వాళ్లకు టికెట్లను అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. 

అందువల్లే ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చేరామని తెలిపారు. మెదక్ జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు.  ఇంటి ఇంటికి గడపగడపకు తిరిగి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అత్యధిక మెజార్టీతో మెదక్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేస్తామని తెలిపారు. 

ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుంది – మంత్రి కేటీఆర్ 

మంత్రి కేటీఆర్  మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి భారత రాష్ట్ర సమితిలోకి తన క్యాడర్‌తో పాటు వస్తున్న తిరుపతి రెడ్డికి హృదయపూర్వక స్వాగతం అని పేర్కొన్నారు.  కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను బలవంతంగా బయటకి పంపించింది,  కానీ భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం స్వాగతించదగిన విషయం అని అన్నారు.  తిరుపతి రెడ్డితో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుందని తెలిపారు. వారికి సముచిత గౌరవాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు.