mt_logo

ఏదైనా విజన్ ఉంటే చెప్పండి.. సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించకండి: మోడీకి కేటీఆర్ హితవు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. పిరమైన ప్రధాని నరేంద్ర మోడీ.. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి.. దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి అని సూచించారు.

ప్రధానిగా పదేళ్లు గడిచినా..తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి. ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు. ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పండి. మా యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పండి. మా ఏజెన్సీ బిడ్డలకు బతుకుదెరువునిచ్చే. బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారో చెప్పండి అని అడిగారు.

మా నవతరానికి కొండంత భరోసానిచ్చే.. ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పండి. తమ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారో చెప్పండి. తెలంగాణకు ఒక్క నవోదయ, ఒక్క మెడికల్ కాలేజీ.. ఒక్క నర్సింగ్ కళాశాల, ఒక్క ఐఐటీ, ఒక్క ట్రిపుల్ ఐటీ.. ఒక్క ఐఐఎం, ఒక్క ఐసర్, ఒక్క ఎన్ఐడీ ఎందుకు ఇవ్వలేదో చెప్పండి అని ప్రశ్నించారు.

సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని.. మా రైతులపై ఎందుకు పెత్తనం చేస్తున్నారో చెప్పండి. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండినా.. 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా.. తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో చెప్పండి అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

చేనేత రంగంపై జీఎస్టీ వేసి.. మగ్గానికి ఎందుకు మరణశాసనం రాశారో చెప్పండి. తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారో చెప్పండి. మండిపోతున్న నిత్యవసర ధరలను ఎందుకు అదుపు చేయలేకపోయారో చెప్పండి.. ముడి చమురు ధరలు తగ్గినా..
మోడీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పండి. భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు.. మీరిచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పండి అని విమర్శించారు.

సబ్ కా సాత్, అచ్చే దిన్ లాంటి నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పండి. మీ పాలనలో పదేళ్లు గడిచినా.. ఇంకా ఉచిత రేషన్ పథకం కింద 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పండి. అవినీతిపరులకు మీ పార్టీలో ఆశ్రయమిచ్చి.. రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను.. ఎందుకు ప్రయోగిస్తున్నారో చెప్పండి అని అన్నారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి అదే రాజ్యాంగాన్ని అందరి కళ్లముందే కాలరాయకండి. దేశ ప్రధాన మంత్రిగా.. ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా.. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేయకండి.. దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి. కానీ.. దయచేసి సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించకండి అని హితవు పలికారు.

చివరగా ఒక మనవి.. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవు.. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డ అని కేటీఆర్ పేర్కొన్నారు.